అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్ : లక్ష్మణ్

అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్ : లక్ష్మణ్

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం పాలవుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆహ్వానించిన తర్వాత ఆయన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారనీ.. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ- డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చేశారని అన్నారు.

రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, హాస్పిటళ్లు.. ఇలా.. పలు విభాగాల్లో బిల్లుల చెల్లింపులు ఆగిపోయి.. పనులు, సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు లక్ష్మణ్. ఉద్యోగ నియామకాలు లేవనీ.. ప్రతీ విషయంలోనూ కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురే అవుతోందని అన్నారు. ఇంటర్ ఆత్మహత్యలపై రాష్ట్రపతి.. గవర్నర్ ను నివేదిక కోరితే… కేసీఆర్ అదంతా కుట్ర అంటున్నారని విమర్శించారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు.

“రాష్ట్రంలో సర్కారు బడులు మూత బడుతున్నాయి. సెక్రటరియేట్ రాని ముఖ్యమంత్రికి కొత్త సెక్రటరియేట్ కడుతున్నారు. దేశభక్తి గురించి చెబుతున్న కేటీఆర్ … ముందు మీ పార్టీ విధానం ఏంటో చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

అమిత్ షాను అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా అభివర్ణించారు లక్ష్మణ్. టీఆర్ఎస్ .. తండ్రీ, కొడుకుల పార్టీ అనీ.. కాంగ్రెస్ .. తల్లీ కొడుకుల పార్టీ అని… బీజేపీ మాత్రమే భరతమాత ముద్దు బిడ్డల పార్టీ అని చెప్పారు.