
టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యంగ్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్. ప్రణయ్, సాత్విక్–చిరాగ్ షెట్టి జోడీ ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో వరల్డ్ 13వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21–15, 21–19తో కొకి వాటనాబే (జపాన్)పై గెలిచాడు. ఈ ఏడాది లక్ష్యకు ఇది వరుసగా మూడో సెమీస్ కావడం విశేషం. ఇంతకుముందు కెనడా, యూఎస్ ఓపెన్లో రౌండ్–4కు చేరుకున్నాడు. 47 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ ర్యాలీలు, స్మాష్లతో అదరగొట్టాడు. తొలి గేమ్లో 6–6తో స్కోరు సమమైన తర్వాత లక్ష్య వరుస పాయింట్లతో హోరెత్తించాడు. రెండో గేమ్లో ప్రత్యర్థి దూకుడు చూపెట్టినా చివర్లో ఇండియన్ ప్లేయర్ స్మాష్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ ప్రణయ్ 21–19, 18–21, 8–21తో టాప్సీడ్ విక్టర్ అక్సల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి 15–21, 25–23, 16–21తో ఒలింపిక్ చాంపియన్స్ లీ యంగ్–వాంగ్ చీ లియాన్ (చైనీస్తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో వరుసగా 12 మ్యాచ్ల విజయానికి తెరపడింది.