భరత్ రాజ్, దివి జంటగా నవీన్ గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లంబసింగి’. కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో ఆనంద్.టి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న థియేటర్స్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నవీన్ గాంధీ మాట్లాడుతూ ‘రాజమౌళి గారి దగ్గర ‘శాంతినివాసం’ సీరియల్ మొదలు, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను.
తర్వాతరాఘవేంద్ర రావు గారి దగ్గర, ముళ్ళపూడి వర దగ్గర వర్క్ చేశా. అలాగే రాజీవ్ మీనన్ దగ్గర యాడ్స్ చేశా. 2014లో ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ‘గాలిపటం’తో దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఆ తరువాత చెన్నై లో యాడ్స్ చేశాను. మళ్లీ ఇప్పుడు ‘లంబసింగి’ చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఒక స్వచ్ఛమైన ప్రేమకథను కళ్ళకు కట్టినట్లు సహజంగా చెప్పాలని ఈ చిత్రం తీశాను.
ఇందులోని ప్రతి పాత్ర రియలిస్టిక్ గా మన చుట్టూ తిరిగే పాత్రల తరహాలో ఉంటాయి. అందుకే కొత్త నటీనటులతో తీశాం. లంబసింగి అనే ఏజెన్సీ ప్రాంతంలో 50 రోజుల్లో సింగల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రేమకథలకు సంగీతం ప్రధానం. ఆర్.ఆర్.ధ్రువన్ అద్బుతమైన పాటలు ఇచ్చాడు. అన్ని పాటలకు మంచి ఆదరణ లభించింది. హృదయాన్ని కదిలించే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవుతుందని నమ్ముతున్నా’ అన్నాడు.