
- బీఆర్ఎస్కు భూకేటాయింపు పిల్పై హైకోర్టు అభ్యంతరం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2004లో బంజారాహిల్స్లో ఎకరం భూమిని బీఆర్ఎస్కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ.. 2024లో పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2004లో భూమి ఇస్తే 20 ఏండ్ల వరకు ఏం చేశారు? ఎందుకు జాప్యం జరిగింది? తెలియజేయాలని పిటిషనర్ మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములు నాయక్ను ఆదేశించింది. పార్టీ ఆఫీసుకు భూమి ఇస్తే అందులో టీన్యూస్ ఆఫీస్ నడుపుతున్నారని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరఫు లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
2004లో నాటి టీఆర్ఎస్కు భూమి కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో 966ను రద్దు చేయాలని కోరారు. అయితే, 20 ఏండ్ల పాటు పిల్ వేయకుండా ఎందుకు ఉన్నారో చెప్పాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.