
- రెవెన్యూ కోర్టుల్లోని 16,147 కేసులకే ట్రిబ్యునల్లు పరిమితం
- పార్ట్ బిలోని 16 లక్షల ఎకరాల భూవివాదాలపై గందరగోళం
- ధరణి ద్వారా చేసుకునే కొత్త అర్జీల పరిష్కారంపై డైలమా
- రెవెన్యూ ట్రిబ్యునళ్ల విచారణ విధానంపైనా సందేహాలు
- కలెక్టర్లు ఇచ్చే తీర్పులు కోర్టుల్లో నిలవవంటున్న లీగల్ ఎక్స్పర్టులు
హైదరాబాద్, వెలుగు: భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పట్టాదారు పాస్బుక్కులు ఇవ్వకుండా పార్ట్-బి కేటగిరీలో చేర్చిన భూ వివాదాల కథ మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రిబ్యునళ్లను కేవలం పెండింగ్లో ఉన్న రెవెన్యూ కోర్టు కేసులకే పరిమితం చేయడం, కొత్త కేసులను విచారించొద్దని ఇన్చార్జి సీసీఎల్ఏ, సీఎస్ సోమేశ్కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో పార్ట్- బి భూముల పరిష్కారంపై నీలినీడలు అలుముకున్నాయి. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న కేసులు కేవలం 16,137 (41,961 ఎకరాలకు సంబంధించి) మాత్రమేనని.. రెవెన్యూ కోర్టులకు ఎక్కని పార్ట్–బి వివాదాలు 16 లక్షలకు ఎకరాలకుపైగా ఉన్నాయని రెవెన్యూ చట్టాల ఎక్స్పర్టులు చెప్తున్నారు. మరి ఆ భూముల సంగతి ఏమిటని అంటున్నారు. మరోవైపు పార్ట్–బిలో భూములు చేర్చి, పాస్బుక్కులు ఇవ్వకపోవడంతో లక్షల మంది రైతుబంధు, క్రాప్ లోన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. భూములు అమ్ముకోలేక అవస్థ పడుతున్నారు. నిజానికి పార్ట్–బి వివాదాలను కలెక్టర్లు రెండు నెలల్లో పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించి నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు.
పార్ట్–బిలో ఇలాంటివే ఎక్కువ
రాష్ట్రంలో సివిల్, రెవెన్యూ కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అన్నదమ్ముల భూపంపకాల్లో తేడాలున్న భూములు, అసైన్డ్ భూములకు ఇచ్చిన పట్టాల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి మధ్య ఉన్న తేడాలు, ఓనర్షిప్ విషయంలో వివాదాలున్న భూములు, రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించి సరిహద్దు వివాదాల్లో ఉన్నవి, సర్వే, రద్దు బదల్ భూములు, అన్యాక్రాంతమైన వక్ఫ్, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, నిషేధిత జాబితాలోని భూములను పార్ట్–బి కింద చేర్చారు. ఇలాంటి భూములు 16 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. ఇందులో సివిల్ కోర్టు వివాదాల్లో లక్షా 11 వేల 258.25 ఎకరాలు, రెవెన్యూ కోర్టు వివాదాల్లో 41 వేల 961.01 ఎకరాలు, రెవెన్యూ, అటవీ సరిహద్దు వివాదాల్లో 2 లక్షల 18 వేల 980 ఎకరాలు, కుటుంబ, సర్వే, రద్దు బదల్ వివాదాల్లో 2 లక్షల 74 వేల 697 ఎకరాలు, వక్ఫ్, దేవాదాయ శాఖకు సంబంధించిన వివాదాల్లో 3 లక్షల 98 వేల 295.17 ఎకరాలు, నిషేధిత జాబితాలో చేరిన భూములు 6 లక్షల ఎకరాల వరకు ఉన్నాయి. ఈ భూవివాదాలపై అర్జీలు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్లో ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ పేరిట ఆప్షన్కూడా ఇచ్చారు. ఇప్పటికే ఈ ఆప్షన్ ద్వారా పెద్ద సంఖ్యలో అప్లై చేసుకుంటున్నారు. ఆ అర్జీలు నేరుగా కలెక్టర్ల లాగిన్లోకి వెళ్తున్నాయి. కొత్త కేసుల విచారణ చేపట్టొద్దని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో.. ఈ అర్జీలన్నింటినీ కలెక్టర్లు పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది.
41,961 ఎకరాలకే రెవెన్యూ ట్రిబ్యునళ్లు
రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న 16,137 కేసులను.. రెవెన్యూ ట్రిబ్యునళ్లు విచారిస్తాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ కేసుల్లోని 41,961 ఎకరాల వివాదాలే ట్రిబ్యునళ్ల పరిధిలోకి రానున్నాయి. మిగతా వారు వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందే. అయితే ఇప్పటికే వేలకొద్దీ కేసులు సివిల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని.. ఇదంతా పేదలకు వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారమని భూచట్టాల ఎక్స్పర్టులు స్పష్టం చేస్తున్నారు. అందుకే రెవెన్యూ ట్రిబ్యునళ్ల పరిధిని, కాలపరిమితిని పెంచాలని సూచిస్తున్నారు. ధరణి పోర్టల్ నే పక్కా హక్కుల రికార్డుగా ప్రభుత్వం చెప్తోంది. ఈ పోర్టల్ రావడానికి ముందు తయారైన భూరికార్డుల్లో లోపాలు ఉన్నాయి. అలాంటి భూముల పట్టాదారు పాస్బుక్కులకు టైటిల్ గ్యారెంటీ ఇవ్వాలి. భూవిస్తీర్ణంలోనూ తేడాలున్నాయి. వీటిని మార్చేలా ధరణిలో అవకాశం ఉండాలి.
– ముస్త్యాల అశోక్ కుమార్, హైకోర్టు అడ్వొకేట్
ఈ ట్రిబ్యునళ్ల తీర్పులు హైకోర్టులో నిలబడకపోవచ్చు
రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఇప్పటికే విచారణలు ప్రారంభించాయి. ఏ కోర్టు అయినా, ట్రిబ్యునల్ అయినా ముందు ఇరువర్గాలకు నోటీసులిచ్చి వాదనలు విని కేసులు పరిష్కరించాలి. కానీ రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని.. రికార్డుల ఆధారంగానే కేసులను పరిష్కరించబోతున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే బార్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులు ఇలా ఇస్తే హైకోర్టులో నిలబడే అవకాశం లేదు. భూవివాదాల పరిష్కారానికి నెలే గడువు పెట్టడం సరికాదు. అందుకే భూవివాదాలన్నీ పరిష్కారమయ్యే వరకు శాశ్వత ప్రాతిపదికన రెవెన్యూ ట్రిబ్యునళ్లను కొనసాగించాలి.
– ఎం.సునీల్కుమార్, భూచట్టాల ఎక్స్పర్ట్, అడ్వొకేట్
For More News..