హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఏళ్లు గడిచినా కంపెనీలు స్థాపించని సంస్థల నుంచి భూములు వాపస్ తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని టీఎస్ఐఐసీ ఆఫీసులో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వివిధ విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంక్, భూముల కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత పరిశ్రమలకు చేసిన భూకేటాయింపులపై సమీక్షించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏయే సంస్థలకు ఎంత భూమి ఇచ్చారు, ఆయా సంస్థలు ఏ అవసరాల కోసం భూమి తీసుకున్నాయి,
వాటిని ఇప్పుడు ఎలా వినియోగిస్తున్నాయి, నిరుపయోగంగా ఉన్న భూములెన్ని వంటి విషయాలపై మంత్రి ఆరా తీశారు. భూములు తీసుకొని ఏళ్లు గడిచినా పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. థర్డ్పార్టీకి లీజుకు ఇచ్చిన సంస్థలు ఏమైనా ఉంటే ఆ వివరాలు సమర్పించాలన్నారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు టీఎస్ఐఐసీ అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న వార్తలు వస్తున్నాయని, అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.