శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఇపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ & కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి రూ. 5 వేల 688 కోట్ల టెండర్ కోసం ఎల్అండ్ టీ లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్ నుండి రెండు ప్రధాన బిడ్లను స్వీకరించినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ జులై 13న తెలిపింది. ఇవాళ మెట్రో రైలు భవన్లో బిడ్డింగ్ను ప్రారంభించారు. రూ.6,250 కోట్లతో చేపట్టనున్న ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తయ్యాయి.
రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ స్టేషన్ మధ్య ప్రతిపాదిత 31 కి.మీ కారిడార్ 1.7 కి.మీ భూగర్భ మార్గాన్ని కలిగి ఉంటుంది. 9 స్టేషన్ల మెట్రో 31-కి.మీ పొడవునా హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ను శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపుతుంది. ఎల్ అండ్ టీ ఇప్పటికే హైదరాబాద్ మెట్రోను పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్లో నడుపుతోంది. గత నెలలో, హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎం డీఏ) జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక్కొక్కటి 10 శాతం విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించాయి .