నిధులిస్తేనే రిపేర్లు చేస్తమని అప్పుడే చెప్పాం: ఎల్​అండ్​టీ

నిధులిస్తేనే రిపేర్లు చేస్తమని అప్పుడే చెప్పాం:  ఎల్​అండ్​టీ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం నిధులిస్తేనే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన రిపేర్లు చేస్తామని 2019లోనే తేల్చిచెప్పామని ఎల్​అండ్​టీ సంస్థ బాంబు పేల్చింది. తాము కోరినా రిపేర్లకు సంబంధించిన డిజైన్లు, అవసరమైన నిధులను ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్, అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని వెల్లడించింది. బ్యారేజీ డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​ పూర్తయినందున దాని రిపేర్ల బాధ్యత తమది కానే కాదని తేల్చేసింది. ఈ మేరకు మేడిగడ్డ ఈఈకి పది రోజుల క్రితం ఎల్​అండ్​టీ సంస్థ లేఖ రాయగా బుధవారం అది వెలుగు చూసింది.

2019 వర్షాకాలంలో బ్యారేజీకి పోటెత్తిన వరదతో సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాయి. నవంబర్​లో బ్యారేజీ గేట్లు దించడంతో దిగువ భాగంలో సీసీ బ్లాకులు చాలా దూరం కొట్టుకుపోయినట్టుగా గుర్తించారు. కానీ ప్రాజెక్టు ఇంజనీర్లు వాటిని సరి చేయాలని తమను కోరనే లేదని ఎల్​అండ్​టీ లేఖలో పేర్కొన్నది. వర్షాకాలం ప్రారంభానికి రెండు వారాల ముందు అంటే 2020 మే 18న మేడిగడ్డ ఈఈ రిపేర్లు చేయాలని తమకు లేఖ రాశారని తెలిపింది. టీఎస్ఈఆర్ఎల్​ స్టడీ ప్రకారం బ్యారేజీ నుంచి వరద వేగాన్ని తగ్గించడానికి కొత్తగా డిజైన్లు చేసి వాటికి అనుగుణంగా వేరింగ్​కోట్స్, సీసీ అఫ్రాన్లు, స్టోన్​అఫ్రాన్లు, డౌన్​స్ట్రీమ్​ అఫ్రాన్​స్ట్రక్చర్​ల పనులు చేపట్టాల్సి ఉందని అప్పుడే గుర్తించారు. ఆ పనులు చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ కోరినా ఎల్​అండ్​టీ అప్పుడే ససేమిరా అన్నది.

ప్రభుత్వ డిజైన్​ల ప్రకారమే బ్యారేజీ నిర్మించామని, పునరుద్ధరణ పనులు తమ బాధ్యత కాదని స్పష్టం చేసింది. ఆ పనులు చేయాలంటే మళ్లీ వర్క్​అగ్రిమెంట్​చేసుకోవాలని చెప్తూ 2020 మే18న మేడిగడ్డ ఈఈకి లేఖ రాసింది. ఆ తర్వాత రిపేర్లకు సంబంధించిన డిజైన్​లు ఇవ్వాలని ఆరు నెలలు లెటర్లు రాసినా ప్రభుత్వమే స్పందించలేదని తెలిపింది. అదే సమయంలో లాక్​డౌన్ ​విధించడం, ప్రభుత్వం రీ డిజైన్​లు, నిధులు ఇవ్వకపోవడంతోనే ఆ పనులు చేయలేదని వివరించింది. 

2022లోనే మా బాధ్యత తీరింది.. 

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​తో 2016 ఆగస్టు 26న వర్క్​అగ్రిమెంట్​చేసుకున్నామని, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్​లకు లోబడే బ్యారేజీని నిర్మించామని లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణానికి సానుకూల వాతావరణం లేకున్నా, అనేక ప్రతిబంధకాలను అధిగమించి నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి చేశామన్నారు.

తాము పనులు పూర్తి చేసి నాలుగేళ్లు గడుస్తున్నా.. చేసిన పనులే చేయాలని కోరడం సరికాదని పేర్కొంటూ 2023 మే 17న మేడిగడ్డ ఈఈకి రాసిన లేఖలోనే స్పష్టం చేశామని తెలిపింది. 2019 జూన్​21న మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించగా వరుసగా నాలుగేళ్లు భారీ వరదలను తట్టుకొని నిలిచిందని, 2022 జులై 13 నుంచి 16 మధ్య రికార్డు స్థాయిలో వరద వచ్చినా బ్యారేజీ తట్టుకొని నిలబడిందన్నారు. 2020 జూన్​29న బ్యారేజీ నిర్మాణం పూర్తి చేశామని ఇంజనీర్లు సర్టిఫికెట్​ఇచ్చారని, ఆ రోజు నుంచి రెండేండ్ల పాటు అంటే 2022 జూన్​28న డిఫెక్ట్​లయబిలిటీ పీరియడ్​ పూర్తయిందని తేల్చిచెప్పింది. అయితే, బ్యారేజీ ఆపరేషన్స్​ అండ్​ మెయింటనెన్స్ (ఓ అండ్​ఎం)​ పీరియడ్ మాత్రం​2025 జూన్​28 వరకు ఉందని తెలిపింది. 

మళ్లీ అదనపు పనులు చేయలేం.. 

బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇటీవల కాలం వరకు రూ.9.70 కోట్లతో ఓ అండ్​ఎం పనులు చేశామని.. ఆయా వివరాలను లేఖలో ప్రస్తావించింది. బ్యారేజీకి సంబంధించిన సివిల్, హైడ్రో మెకానికల్ పనులు 2019 జూన్​21న పూర్తి చేశామని తెలిపింది. గైడ్​బండ్స్, ఫ్లడ్​బండ్స్, డైవర్షన్​ చానళ్లు, కుదురుపల్లి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు అప్రోచ్​ రోడ్డు, లెఫ్ట్​ బ్యాంక్, రైట్​బ్యాంక్, 3డీ మోడల్ ​స్టడీస్​(లెఫ్ట్, రైట్​బ్యాంకులవి) పనులు కూడా అదే రోజున పూర్తి చేశామని తెలిపింది.

ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​తో తాము చేసుకున్న అగ్రిమెంట్​లో వీఐపీ గెస్ట్​హౌస్, ఏఈఈ, డీఈఈ క్వార్టర్లు, కంట్రోల్ ​రూమ్​కు అప్రోచ్​రోడ్డు, గార్డ్​రూమ్, ఫ్యాబ్రికేషన్​ అండ్​ఎరిక్షన్​ఆఫ్​గేట్స్​ వంటి నిర్మాణాలు లేకున్నా ఆ పనులు కూడా చేశామని, అందుకు తాము రూ.7.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. అయినా మళ్లీ అదనపు పనులు చేయాలని కోరడం సరికాదని తేల్చిచెప్పింది. బ్యారేజీ పనులన్నీ పూర్తి చేశామని, అలాగే డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​కూడా పూర్తయినందున బిల్లులు, అగ్రిమెంట్లు క్లోజ్​చేయాలని కోరుతూ 2023 మే 17న లేఖ రాశామని కూడా గుర్తు చేసింది.