
న్యూఢిల్లీ: ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 1,500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుం ది. 2017, మార్చి 31 నాటికి ఈ కంపెనీలో 41,466 మంది ఉద్యోగులు ఉండగా, 2018, మార్చి 31 నాటికి వీరి సంఖ్య 42,924 మందికి చేరింది. ఏటా 1,500 మందికి అవకాశాలు ఇచ్చే విధానాన్ని ఈసారి కూడా కొనసాగిస్తామని కంపెనీ కార్పొరేట్ హెచ్ఆర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యోగి శ్రీరామ్ అన్నారు.
మిగతా కంపెనీల కంటే తమ దాంట్లో రాజీనామాల రేటు అతితక్కువగా ఐదుశాతమే ఉందని చెప్పారు. ఎల్ అండ్ టీ ఇటీవల మధ్యస్థాయి ఐటీ సంస్థ మైం డ్ ట్రీని బలవంతంగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ సంస్కృతి, ఇతర పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఈ కొనుగోలును మైండ్ ట్రీ ప్రమోటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతోపాటు వారి కెరీర్ బాగుపడే విధానాలను అమలు చేస్తామని చెప్పారు. ఐటీ, ఫైనాన్స్లోనే గాక ఇంజనీర్లుగానూ మహిళలకు అవకాశాలిస్తున్నామని వివరించారు. ఎల్ అండ్ టీలో డిజిటైజేషన్ పెరుగుతున్నందున, లేఆఫ్లకు అవకాశాలు ఉంటాయా ? అన్న ప్రశ్నకు లేదని జవాబిచ్చారు. 2018 సంవత్సరానికిగానూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎంప్లాయర్ అవార్డును బిజినెస్ మాగజైన్ ఫోర్బ్స్ ఎల్ అండ్ టీకి అందజేసింది.