
విజయ్ దేవరకొండ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్ని దాటి దేశమంతా వ్యాపించింది. ఈ రౌడీ హీరో నటించిన ‘లైగర్’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. హీరో హీరోయిన్లతో పాటు పూరి జగన్నాథ్ కూడా వరుస ప్రెస్మీట్స్లో పాల్గొంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా విజయ్ని చూడటానికి జనం పోటీపడుతున్నారు. అభిమానులు, మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు హుషారుగా జవాబులు చెబుతున్నాడు విజయ్. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాడు.
రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో సుకుమార్తో సినిమా గురించి మాట్లాడాడు విజయ్. ‘పుష్ప 2’ పూర్తవగానే తమ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని కన్ఫర్మ్ చేశాడు. నిజానికి ఈ మూవీని ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ఇప్పటికీ స్టార్ట్ కాకపోవడం.. జనగణమన, ఖుషీ లాంటి సినిమాలకు విజయ్ కమిటవడంతో సుకుమార్ తో సినిమా ఉంటుందా లేదా అనే డౌట్ ఉంది. ఇప్పటికి క్లారిటీ వచ్చింది. మరోవైపు ‘లైగర్’కి నిరసన సెగలు తగులుతున్నాయి. కొందరు ‘లైగర్ బాయ్ కాట్’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ నడుపుతున్నారు.
ముంబై ప్రెస్మీట్లో విజయ్ ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా గురించి, ఆమిర్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం, ‘లైగర్’కి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించడం వంటివే ఇందుకు కారణం. అంతేకాక అనన్యాపాండే హీరోయిన్ కావడంతో నెపోటిజాన్ని వ్యతిరేకించేవాళ్లంతా ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై విజయ్ తనదైన శైలిలో రియాక్టయ్యాడు. ‘మనం కరెక్ట్గా ఉన్నప్పుడు.. మన ధర్మం మనం చేసినప్పుడు.. ఎవ్వడి మాటా వినేది లేదు. కొట్లాడుదాం’ అంటూ ట్వీట్ చేశాడు. సినిమా హిట్టు కొడితే అన్నీ అవే ఆగుతాయి, అంతవరకు వెయిట్ చేయడమే అంటూ విజయ్కి సపోర్ట్గా ‘వాట్ లగాదేంగే’ అనే హ్యాష్ట్యాగ్ ని రన్ చేస్తున్నారు ఫ్యాన్స్.