తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి బదిలీపై న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అభిషేక్ రెడ్డి బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హైకోర్టు ముందు ఆందోళన చేపట్టారు. జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొలిజియం సిఫార్సును వెంటనే వెనక్కి తీసుకోవాలని.. న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు.
జస్టిస్ అభిషేక్ రెడ్డి 1990 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి... 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన...1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. హైకోర్టుతో పాటు సివిల్ కోర్టులో కూడా రాజ్యాంగ కేసులను అభిషేక్ రెడ్డి వాదించారు.