కరోనా వ్యాక్సిన్ కు మిట్టల్ సాయం

కరోనా వ్యాక్సిన్ కు మిట్టల్ సాయం

లండన్: తన స్టీలు ఫ్యాక్టరీలో ఆర్సెలార్లో తయారు చేసే ఉక్కుఎంతో దృఢంగా ఉండొచ్చు కానీ దాని యజమాని లక్ష్మీ మిట్టల్ మనసు మాత్రం వెన్న మాదిరి మృదువైనదనే చెప్పాలి. కరోనా బాధితులను రక్షించడానికి ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీకి ఏకంగా 3.5 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.33 కోట్లు) చెక్ను అందజేశారు. ఇక నుంచి ఈ ప్రొఫెసర్షిప్ను ‘లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ ప్రొఫెసర్షిప్ ఆఫ్ వ్యాక్సినాలజీ’ అని పిలుస్తారు. ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ ప్రస్తుతం దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ టీమ్కు ఆయనే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కూడా! ఇండియాకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నది. ప్రస్తుతం ఈ టీమ్ మెంబర్లు ఇంగ్లండ్తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారు. ‘‘హెల్త్కేర్ సెక్టార్ అంటే నాకు ఎంతో ఆసక్తి. కరోనా వ్యాక్సిన్లు, ట్రీట్మెంట్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ప్రొఫెసర్ అడ్రియన్ హిల్తో నాతోపాటు, మా కుటుంబ సభ్యులూ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఆయన చేస్తున్న కృషి ఎంతో నచ్చింది. ఆయన టీమ్ చాలా కష్టపడుతున్నది. కరోనాతోపాటు భవిష్యత్లో వచ్చే సవాళ్లకు ఈ ప్రొఫెసర్ టీమ్ సమాధానాలు వెతుకుతోంది”అని మిట్టల్ అన్నారు.

కరోనాకు టీకా తీసుకురావడం అత్యవసరమని స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు మిట్టల్ తన వంతు సాయం చేశారు. ఎబోలా ప్రైవేట్ సెక్టార్ మొబిలైజేషన్ గ్రూప్లో ఫౌండింగ్ మెంబర్గా చేరారు. ఆఫ్రికాలో 2004లో ఎబోలా వల్ల చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. బాధితులకు సాయం అందించడానికి ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. ఆక్స్‌‌ఫర్డ్‌‌ జెన్నిఫర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ హిల్ ఎబోలా వ్యాక్సిన్ తయారు చేసి అందరికంటే ముందుగానే క్లినికల్ ట్రయల్స్ చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రయోగాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అయితే వచ్చే నెల 15నాటికి తమ వ్యాక్సిన్ రెడీ అవుతుందని సంచలన ప్రకటన చేసింది. తమ ప్రయోగాలకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ వచ్చాయని ప్రకటించింది. ఇండియాకు చెందిన జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ప్రయోగాలకు కూడా మోడీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం