మహబూబ్నగర్, వెలుగు: ఎంపీ సంతోష్కుమార్కు స్వాగతం చెప్పేందుకు నేతలు, అధికారులు రోడ్ల వెంబడి మహిళలను నిలబెట్టించి దండాలు పెట్టించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లాలో గ్రీన్ ఇండియా చాలెంజ్ స్టార్ట్ చేయడానికి వచ్చిన ఎంపీకి వెల్కమ్ చెప్పేందుకు అబ్కారీ మంత్రి శ్రీనివాస్గౌడ్.. 2 వేల మంది మహిళలను కిలోమీటర్ పొడవునా చేతిలో మొక్కలతో నిలబెట్టించి దండాలు పెట్టించారు. తర్వాత కేసీఆర్ ఎకో పార్క్లో ఎంపీ, మంత్రి మొక్కలు నాటారు. రెండు కోట్ల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని, అదే పార్క్లో జింకల పార్క్ను కూడా ప్రారంభించారు. ఈ నెల 10న మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడూ ఇలాంటి సంఘటనే జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి కేటీఆర్ వెళ్లగా.. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, అక్కడి జిల్లా అధికారులు రోడ్ల వెంబడి అంగన్వాడీ మహిళలు, స్వయం సహాయక సంఘాల గ్రూపుల మహిళలతో దండాలు పెట్టించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ నేతల రాక కోసం మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారు. కొంత మంది వృద్ధులు నిలబడలేక కింద కూర్చుండిపోయారు. ఈ సంఘటనలపై తీవ్ర విమర్శలొచ్చాయి. మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చి టీఆర్ఎస్ నేతల మెప్పు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.