లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : అఖిలపక్ష నాయకులు

లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : అఖిలపక్ష నాయకులు
  • కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నాయకులు 
  •  ఉమ్మడి జిల్లాలో సార్వ్రతిక సమ్మె–భారత గ్రామీణ బంద్​సక్సెస్​

వెలుగు, నెట్​వర్క్​ :  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్​చేశారు.  రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరారు. విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలన్నారు. కార్మిక, కర్షక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె–భారత గ్రామీణ బంద్​సక్సెస్​ అయ్యింది.

మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. సింగరేణి బోగ్గు గనుల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ, ఐఎన్​టీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరయ్యారు. బస్సులు బస్​ డిపోల్లో నుంచి బయటికి రానీయకుండా సంఘాల నేతలు డిపోల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఆటోలు కూడా ఎక్కువగా రోడ్డెక్కలేదు. కొన్నిచోట్ల  స్కూల్స్, హోటళ్లు, వ్యాపార,వాణిజ్య సంస్థలు, పాన్ షాపులు, బ్యాంకులను సంఘాల లీడర్లు బంద్ చేయించారు.

ఖమ్మంలోని రోటరీ నగర్ లో ఎస్ బీఐ బ్యాంకు స్టాఫ్ బంద్ కు సహకరించకపోవడంతో ఆందోళన జరిగింది. బ్యాంకులోని కంప్యూటర్ ధ్వంసమైంది. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించేవరకు పోరాడుతామన్నారు. వరంగల్ క్రాస్ రోడ్డులో బంద్​ను ఖమ్మం సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు.