
నల్గొండ, వెలుగు: తెలంగాణలో తొమ్మిదేండ్ల తర్వాత రాక రాక వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న బీఆర్ఎస్ఎమ్మెల్యేల వ్యూహం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కారణంగా బెడిసికొట్టింది. ఏకంగా 25 లక్షల మంది యువతీయువకులు పోటీ పరీక్షలు రాస్తుండడంతో వారిని ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు రాష్ట్రంలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో ఏడాది కిందే ఫ్రీ కోచింగ్సెంటర్లు తెరిచారు. ఎక్కడెక్కడి నుంచో ఫ్యాకల్టీని రప్పించి , ఫ్రీ ఫుడ్,అకామిడేషన్ పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. యూత్ ఓటర్లంతా ఇక తమ చేతిలో ఉన్నట్లే అనుకుంటున్న టైంలో టీఎస్పీఎస్సీ పేపర్లీకేజీ వ్యవహారం బయటపడడంతో సీన్ రివర్స్అయింది. అసలే పేపర్ లీకేజీ ఘటనతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, సర్కారు తీరును ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి. మరోవైపు న్యాయం కోసం నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగుతుండడంతో ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు.
50కి పైగా ఫ్రీ కోచింగ్ సెంటర్లు..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్గతేడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్స్కు సంబంధించి గ్రూప్,1,2,3,4 నోటిఫికేషన్లు రిలీజ్అయ్యాయి. సీఎం ప్రకటనతోనే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో హడావిడి మొదలైంది. ఏకంగా 24 లక్షల మంది టీఎస్పీఎస్సీలో వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో వీళ్లందరినీ ఓటుబ్యాంకుగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే సుమారు 50మందికిపైగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఫ్రీ కోచింగ్సెంటర్లు తెరిచారు. ఇందుకోసం అప్పటికప్పుడు తమ తండ్రులు, తాతల పేర్లతో ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని రప్పించి మరీ ట్రైనింగ్ ఇప్పించారు. కొందరైతే లోకల్గా ఉన్న కోచింగ్ సెంటర్లను దత్తత తీసుకొని తమ పేర్లతో ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఈ కోచింగ్ సెంటర్ల పేరిట ఒక్కో ఎమ్మెల్యే ఇప్పటివరకు రూ.50 లక్షల నుంచి రూ. కోటి దాకా ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్లైన్పై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో అప్పటికే యూత్ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు యువ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని రూలింగ్ పార్టీ చేయించిన సర్వేల్లోనూ తేలింది. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేలు చేసిన ఫ్రీ కోచింగ్ ప్రయోగం సక్సెస్ అయిందనే టాక్ వచ్చింది. ప్లాన్ వర్కవుట్ అయిందని సంబరపడ్తున్న టైంలో పేపర్ లీకేజీల వ్యవహారం బయటపడడం ఎమ్మెల్యేలంతా పరేషాన్లో పడ్డారు.
మంత్రుల కామెంట్లపైనా ఆగ్రహం..
ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతీయువకులు సొంత ఊర్లను విడిచి, హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లో హాస్టళ్లు, రూములు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అక్కడి దాకా వచ్చే స్థోమతలేనివారు నియోజకవర్గ కేంద్రాల్లోనో, సమీప పట్టణాల్లో ఏర్పాటుచేసిన కోచింగ్సెంటర్లకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది మంది తాము చేస్తున్న ప్రైవేట్జాబ్స్ మానేశారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నెలల తరబడి లీవ్లు పెట్టి చదివారు. తీరా పేపర్లు లీకవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి టైంలో వారికి మనోధైర్యం కల్పించాల్సిన మంత్రుల్లో కొందరు బాధ్యతారహితంగా మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడ్తున్నారు. ‘ఒకరిద్దరు చేసిన తప్పుతో మాకే సంబంధం? ’ అని మంత్రి కేటీఆర్ అంటే ‘లీకేజీలు కామన్’ అని మరో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కామెంట్ చేయడాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. మరోవైపు లీకేజీ వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగులు మండల, జిల్లా కేంద్రాల్లోనూ రోజుకో చోట ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నారాజ్అయ్యారు. యూత్ను బుట్టలో వేసుకునేందుకు ఏడాదికాలంగా తాము పడ్డ కష్టమంతా బూడిదలో పోసినట్లయిందని వాపోతున్నారు.