ప్రస్తుత సమస్యలు వదిలేసి.. 2047 కలలు కంటున్నారు.. మోదీ 11 ఏండ్ల పాలనపై రాహుల్

ప్రస్తుత సమస్యలు వదిలేసి.. 2047 కలలు కంటున్నారు..  మోదీ 11 ఏండ్ల పాలనపై రాహుల్

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదకొండేండ్లుగా ప్రస్తుత సమస్యల గురించి మాట్లాడకుండా 2047 ఏడాది కోసం కలలు కంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సోమవారం (June 9) నాటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే, మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై రాహుల్​ ఎక్స్​వేదికగా స్పందించారు. 

" పదకొండేండ్ల మోదీ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదు. మార్పు లేదు. అంతా ప్రచారం మాత్రమే. ప్రస్తుత 2025 గురించి మాట్లాడటం మానేసి.. 2047 సంవత్సరం కలలు కంటోంది" అని విమర్శించారు. 

ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం

హర్యానా, మహారాష్ట్రకు సంబంధించిన ఓటర్ల జాబితా డేటాను అందజేస్తామన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని రాహుల్ ​గాంధీ ప్రశంసించారు. ఇది ఈసీ మంచి మొదటి అడుగుగా అభివర్ణించారు. అయితే, డేటాను డిజిటల్, మెషిన్ -రీడబుల్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో అందజేసే కచ్చితమైన తేదీని ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. 

 గత  పదకొండేండ్లలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాలను తీవ్రంగా దెబ్బ తీసిందని కాంగ్రెస్ ​అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సోమవారం ఆయన ఎక్స్​ వేదికగా మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.