
షాద్ నగర్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న సెల్లార్ల నిర్మాణాలను వెంటనే ఆపాలన్నారు.
మున్సిపాలిటీలో 10 శాతం భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం 16వ వార్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని10 వ వార్డు కౌన్సిలర్ శ్రావణి కోరారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మున్సిపల్ సభ్యులందరూ ఎటువంటి బేషజాలకు పోకుండా కలిసిమెలిసిగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కమిషనర్ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎమ్మెస్ నటరాజ్, కో ఆప్షన్ సభ్యులు కిశోర్ తదితరులు పాల్గొన్నారు.