హైదరాబాద్, వెలుగు : ఎల్ఐసీ తన 63వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ–టెక్ టర్మ్ పేరుతో సరికొత్త ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ పాలసీ సేల్స్ కేవలం ఆన్లైన్ ద్వారానే చేపట్టనుంది. ఆదివారం ఈ పాలసీని లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం తాము 47 ప్రొడక్ట్లను ఆఫర్ చేస్తున్నట్టు ఎల్ఐసీ ప్రతినిధులు చెప్పారు. ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ కింద 29.09 కోట్ల మంది పాలసీ హోల్డర్స్కు, గ్రూప్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ కింద 11.61 కోట్ల మంది వ్యక్తులకు తాము ప్రొటక్షన్ అందిస్తున్నట్టు ఎల్ఐసీ జోనల్ మేనేజర్ మినీ ఐప్ చెప్పారు. 74.71 శాతం మార్కెట్ షేరుతో తాము మార్కెట్ లీడర్గా కొనసాగుతున్నట్టు తెలిపారు. ఎల్ఐసీ ఇండియాకు ప్రస్తుతం రూ.31 లక్షల కోట్ల ఆస్తులు.. 2,048 బ్రాంచ్ ఆఫీసులున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 1.12 లక్షల మంది ఉద్యోగులున్నట్టు చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ మొత్తం ఇన్కమ్ రూ.5.60 లక్షల కోట్లకు పెరిగితే.. దానిలో రూ.3.37 లక్షల కోట్లు ప్రీమియంల నుంచే వచ్చినట్టు వెల్లడించారు. రూ.1,63,104.50 కోట్ల విలువైన క్లయిమ్స్ను సెటిల్ చేసినట్టు పేర్కొన్నారు. క్లయిమ్స్ సెటిల్ చేయడంలో కూడా తామే ముందంజలో ఉన్నట్టు ఐప్ చెప్పారు.
క్యూ1లో రూ.800 కోట్ల పాలసీలు విక్రయం…
2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ 31 లక్షలకు పైగా కొత్త పాలసీలను జారీ చేసిందని.. వీటి ప్రీమియం ఇన్కమ్ రూ.5,365 కోట్లుగా ఉన్నట్టు ఐప్ ప్రకటించారు. సౌత్ సెంట్రల్ జోన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలున్నాయి. సౌత్ సెంట్రల్ జోన్ కింద 1.67 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఈ జోన్లో పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్ బిజినెస్ సెగ్మెంట్ కింద 2.07 కోట్ల మందిని, సోషల్ సెక్యురిటీ స్కీమ్స్ కింద 31.13 లక్షల మందిని కవర్ చేస్తోంది. గ్రూప్ బిజినెస్ల నుంచి ప్రీమియం ఇన్కమ్ రూ.16,006 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ ముగిసే నాటికి ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రూ.800 కోట్ల విలువైన కొత్త ప్రీమియం పాలసీలను అమ్మింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. ఇవి 8.5 శాతం వృద్ధి సాధించినట్టు ఎల్ఐసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ క్యూ1లో రూ.25 వేల కోట్ల విలువైన కొత్త ప్రీమియం పాలసీలను అమ్మింది.