
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అమీర్ పేట్, మైత్రి వనం, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో వాన పడింది. రాగల మూడు రోజులు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
ప్రధానంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి ఉత్తర తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా పశ్చిమ మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వెల్లడించింది.