మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ లంగర్ హౌస్లోని కుతుబ్ షాహీ మినార్పై పిడుగు పడింది. దీంతో మినార్ పైనున్న లోహం ఊడి కింద పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఈ క్రమంలో గోల్కొండకు వెళ్లే దారిలో ఉన్న కుతుబ్ షాహి మినార్పై ఒక్కసారిగా పిడుగు పడడంతో మినార్కు ఉన్న మెటల్ వస్తువు ఊడి కిందపడింది. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా పిడుగుపాటుకు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.