ఆర్ కేపీ ఓపెన్కాస్ట్ మైన్ ఫేజ్ 2 విస్తరణకు లైన్ క్లియర్

ఆర్ కేపీ ఓపెన్కాస్ట్ మైన్ ఫేజ్ 2 విస్తరణకు లైన్ క్లియర్
  • పునరావాసం కల్పించాలంటూ ప్రభావిత ప్రాంతవాసుల డిమాండ్​
  • ప్రజాభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్న అధికారులు  

కోల్​బెల్ట్​, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్ ​కాస్ట్ మైన్ ​ఫేజ్–-2 విస్తరణకు సహకరిస్తామని, అయితే.. పునరావాసం కల్పించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలని ప్రభావిత ప్రాంత ప్రజలు డిమాండ్​ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్​ఓసీపీ క్యాంప్​ఆఫీస్​వద్ద ఆర్ కేపీ ఓసీపీ ఫేజ్​-– 2 ఎక్స్​టెన్షన్ ​మైన్​విస్తరణకు పర్యావరణ పర్మిషన్ కోసం పబ్లిక్​హియరింగ్ ​నిర్వహించారు. సభలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు, అభిప్రాయాలు, సూచనలను ఆఫీసర్లు నమోదు చేసుకోగా.. పలువురు వినతిపత్రాలు అందజేశారు. ప్రజాభిప్రాయసేకరణ సజావుగా సాగింది. 

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అధ్యక్షతన పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఎన్విరాన్​మెంట్​బోర్డు ఇంజనీర్ ​లక్ష్మణ్ ​ప్రసాద్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, సింగరేణి కార్పొరేట్ ​ఎన్విరాన్​మెంట్ జీఎం సైదులు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​రెడ్డి,సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నేత కాంపెల్లి సమ్మయ్య, ఇతర సంఘాల నేతలు,  రాజకీయ పార్టీల లీడర్లు,పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్​ఓపెన్​కాస్ట్​మైన్ ఏర్పాటు సందర్భంగా అప్పటి ఆఫీసర్లు, సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతవాసులు, కార్మిక, రాజకీయ పార్టీల లీడర్లు గుర్తు చేశారు.