- బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగాల శోభారాణి
బషీర్ బాగ్, వెలుగు : బీఆర్ఎస్లో బీసీ మహిళలకు సరైన స్థానం దక్కడం లేదని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల శోభారాణి ఆరోపించారు. పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం ముందు ఆమె ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లలో ఒక్క బీసీ మహిళకు కూడా అవకాశం కల్పించలేదని శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలను సీఎం కేసీఆర్ విసర్మించారని ఆమె మండిపడ్డారు.
సీఎంను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు యత్నించినా కుదరలేదన్నారు. మహిళా బిల్లు కోసం పోరాటం చేశానని చెబుతున్న ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి ఉంటే బీసీ మహిళలకు పార్టీలో టికెట్లు ఇప్పించాలని శోభారాణి కోరారు. లేకపోతే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని ఆమె హెచ్చరించారు.