
ఫుట్ బాల్ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ విజయానికి ప్రతీకగా ఖతార్ లో ఓ ప్రత్యేకమైన మినియేచర్ మ్యూజియం రూపుదిద్దుకోబోతోంది. అతను పిఫా ఫుట్ బాల్ 2022 ఛాంపియన్ షిప్ సమయంలో బస చేసిన గది.. ఇకపై మ్యూజియంగా రూపాంతరం చెందబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఖతార్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అర్జెంటీనా నేషనల్ టీమ్ బస చేసిన గదుల ఫొటోల శ్రేణిని ప్రచురించిన ఖతార్ విశ్వవిద్యాలయం ... చివరి పోస్ట్లో అర్జెంటీనా కెప్టెన్ ఉపయోగించిన గది B201 మ్యూజియంగా మారుతుందని ప్రకటించింది.
అర్జెంటీనా జట్టు చొక్కా రంగుకు సరిపోయేలా మొత్తం ఆ ప్రాంతాన్ని నీలం, తెలుపు రంగులతో అలంకరించారు. దాంతో పాటు పలు ఆటగాళ్ల పేర్లతో కూడిన జెర్సీల ఛాయాచిత్రాలను కూడా గదుల చుట్టూ ఉంచారు. అయితే "అర్జెంటీనా జాతీయ జట్టు ఆటగాడు లియోనెల్ మెస్సీ గది మారదు. సందర్శకులకు అందుబాటులో ఉంటుంది’’ అని ఖతార్ విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ హిట్మీ అల్ హిట్మీ తెలిపారు. మెస్సీ వినియోగించిన వస్తువులు, విద్యార్థులకు, భవిష్యత్తు తరాలకు వారసత్వంగా నిలుస్తాయన్నారు. ప్రపంచ కప్ సమయంలో మెస్సీ సాధించిన గొప్ప విజయాలకు ఇవి సాక్ష్యంగా ఉంటాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.