
- హైదరాబాద్ స్టార్టప్ ‘ఆంకోఫీనోమిక్స్’ కొత్త ఆలోచన
- అందరికీ అందుబాటులో ఉండేలా ‘లిక్విడ్ బయాప్సీ’
- మూత్ర పరీక్షతోనూ గుర్తింపు
కేన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంటున్న మహమ్మారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం, ఎక్కువ మరణాలకు కారణమవుతున్న రోగం ఇదే. 2030 నాటికి కేన్సర్ మరణాలు 1.31 కోట్లకు పెరుగుతాయని అంచనా. ఒక్క ఇండియాలోనే పోయినేడాది 7,84,821 మంది కేన్సర్కు బలయ్యారు. సిగరెట్లు, మద్యం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల కేన్సర్ వస్తుంటుంది. ప్రారంభ దశలోనే దానిని గుర్తించే పరీక్షలు బాగా నొప్పితో కూడుకున్నవి. భరించలేని బాధనిచ్చేవి. ఆ బాధ నుంచి తప్పించేందుకు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఆంకోఫీనోమిక్స్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కేన్సర్ పరీక్ష నొప్పిలేకుండా, అందరికీ అందుబాటులో ఉండేలా ఓ కొత్త పరీక్షను తీసుకొచ్చింది. అదే ‘లిక్విడ్ బయాప్సీ’ టెస్ట్. రక్తం, మూత్రం నమూనాలతోనే ప్రారంభ దశలో ఉన్న కేన్సర్ను ఈ పరీక్ష ద్వారా గుర్తించొచ్చు.
ఇదీ ఆ టెస్టు
మామూలుగా అయితే కేన్సర్ను గుర్తించేందుకు నీడిల్ బయాప్సీ, ఓపెన్ సర్జికల్ బయాప్సీని చేస్తారని కంపెనీ ఓనర్ శిబి చక్రవర్తి చెప్పారు. ‘‘ఈ ప్రాసెస్ చాలా బాధతో కూడుకున్నది. ఒంట్లోని ఓ కణజాలాన్ని (టిష్యూ)ను కట్ చేస్తారు. దాన్ని పాథాలజీ ల్యాబ్కు పంపి అది కేన్సరా కాదా అని తేలుస్తారు. ఇది చాలా రిస్క్ కూడా. అందులోనూ ఔట్పేషెంట్ రోగులకు చెయ్యరు” అని ఆయన చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగానే ‘లిక్విడ్ బయాప్సీ’ని తాము తీసుకొచ్చామన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ తరహా టెస్టులను చేస్తున్నాయని, ఇండియాలో మాత్రం ఇదే మొదటిదని తెలిపారు.
రోగిని బట్టి ట్రీట్మెంట్
ఇప్పటిదాకా కేన్సర్ రోగులందరికీ ఒకేరకమైన ట్రీట్మెంట్ చేస్తున్నారని శిబి చక్రవర్తి అంటున్నారు. కేన్సర్ను బట్టి కాకుండా అందరికీ ఒకేలా కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలు చేస్తున్నారన్నారు. కేన్సర్ పేషెంట్కు సరైన మందు ఇచ్చేలా చేయడమే తమ మిషన్ అన్నారు. కేన్సర్ కారక కణాలపై రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపైనే ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నారు. ప్రపంచస్థాయి లేబొరేటరీ తమకు ఉందన్నారు. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నామని, అన్నీ అయ్యాక కమర్షియల్గా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఫార్మాకంపెనీలు కేన్సర్కు ఎప్పుడూ ఏదో ఒక కొత్త మందును తీసుకొస్తున్నా, కొత్త డయాగ్నస్టిక్ టెస్టులు మాత్రం రావడం లేదన్నారు. ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ జేమ్స్ యాలిసన్తో కలిసి పనిచేస్తున్న రీసెర్చ్ సైంటిస్టులు, ఇమ్యునో ఆంకాలజిస్టుల్లో ఒకరు శిబి చక్రవర్తి.
ఇది స్టార్టింగే
ప్రస్తుతం కంపెనీ గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సెర్వికల్ కేన్సర్)కు మాత్రమే టెస్టును చేస్తోంది. ప్రస్తుతం మహిళలకు పాప్స్మియర్ లేదా మమ్మోగ్రామ్ ద్వారా మాత్రమే టెస్టులు చేస్తున్నారని, కేన్సర్ అని అనుమానం వస్తేనే టెస్టు కోసం తమ దగ్గరకు వస్తున్నారని శిబి చెప్పారు. రొమ్ము కేన్సర్ను గుర్తించడం సులువే అయినా, అండాశయ కేన్సర్ను గుర్తించడమే చాలా కష్టమని చెప్పారు. కేన్సర్ గడ్డ పెరిగాక మాత్రమే అది బయటపడుతుందన్నారు. ఈ లిక్విడ్ బయాప్సీ ద్వారా అండాశయ కేన్సర్నూ తేలిగ్గా గుర్తించొచ్చన్నారు. ఊపిరితిత్తుల కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్లను కేవలం మూత్రపరీక్ష ద్వారా గుర్తించొచ్చన్నారు.
తక్కువ ధరకే
ప్రస్తుతం కేన్సర్ పరీక్షలకు కంపెనీలు ₹1.5 లక్షల నుంచి ₹5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని, మామూలు జనానికీ దానిని అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని శిబి తెలిపారు. తమ లిక్విడ్ బయాప్సీ టెస్టుకు ₹25 వేలు ఖర్చువుతోందని, దానిని ₹7500కు తగ్గించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా ప్రభుత్వ పథకాలైన సీజీహెచ్ఎస్, ఆయుష్మాన్ భారత్ కిందకి ఈ టెస్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్ల చాలా మందికి టెస్టును ఫ్రీగా చేయించుకునే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల కోసం లెట్స్ వెంచర్తో కలిసి పనిచేస్తోంది.