రెండు పానీపూరీల కోసం రోడ్డుపై మహిళ ధర్నా.. రూ.20కి ఆరుకు బదులు నాలుగే పానీపూరీలు ఇచ్చాడని ఆరోపణ

రెండు పానీపూరీల కోసం రోడ్డుపై మహిళ ధర్నా.. రూ.20కి ఆరుకు బదులు నాలుగే పానీపూరీలు ఇచ్చాడని ఆరోపణ
  • ఏడుస్తూ న్యాయం చేయాలని డిమాండ్.. గుజరాత్‌‌లో ఘటన

గాంధీనగర్: గుజరాత్‌‌లోని వడోదరలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పానీపూరీ బండి ఓనర్ తాను చెల్లించిన డబ్బులకు సరిపడ పానీ పూరీలు ఇవ్వలేదని ఓ మహిళ గుక్కపెట్టి ఏడ్చింది. న్యాయం చేయాలంటూ నడిరోడ్డుపై కూర్చుని ధర్నాకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

వివరాల్లోకి వెళితే.. మచ్చిపిఠకు చెందిన మహిళ.. పానీ పూరీ తినడానికి సుర్‌‌ సాగర్ ఏరియాలోని ఓ స్టాల్‌ ‌కు రెగ్యులర్‌ ‌గా వెలుతుంది. గురువారం సాయంత్రం కూడా వెళ్లి, రూ.20 చెల్లించి  ప్లేట్‌‌ పానీపూరీ ఇవ్వాలని కోరింది. అయితే, పానీపూరీ సెల్లర్ నాలుగే ఇచ్చాడని, మిగతా రెండు పానీపూరీ ఇవ్వాలని మహిళ గొడవకు దిగింది.  

సెల్లర్ ఇవ్వకపోవడంతో గుక్కపెట్టి ఏడుస్తూ వెళ్లి రోడ్డు మధ్యలో కూర్చుంది. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మొండిగా నిరసన కొనసాగించడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.  సెల్లర్ ప్రతిసారీ తనను మోసం చేస్తాడని ఆరోపిస్తూ.. ఆ స్టాల్‌‌ను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేసింది.

 దాంతో పోలీసులు మళ్లీ స్పాట్‌‌కు వెళ్లి ఆ రోజుకు స్టాల్​ను మూసివేయించారు. దీనిపై సెల్లర్ మాట్లాడుతూ..  తాను కరెక్ట్ గానే పానీపూరీలు ఇచ్చానని,  గొడవకు దిగడంతో అదనంగా మరికొన్ని కూడా ఇచ్చానని చెప్పాడు.