- 2014–15లో ఆదాయం రూ. 10.88 వేల కోట్లే..
- 2020–21లో 27.28 వేల కోట్లు
- ఈ ఆర్థిక సంవత్సరం 4 నెలల్లో రూ. 9,509 కోట్ల రాబడి
- ఏడేండ్లలో మొత్తం రూ. 1.35 లక్షల కోట్ల మద్యం సేల్స్
- మరింత ఆమ్దానీ పెంచుకునేందుకు ప్రయత్నాలు
- సర్కారు ఖజానాకు కిక్కు మరో 150 వైన్స్?
- రెండు మూడు నెలల్లో కొత్త మండలాల్లో ఏర్పాటు
- లిస్టు రెడీ చేస్తున్న ఆబ్కారీ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆబ్కారీ శాఖ నుంచి మస్తు ఆమ్దానీ వస్తోంది. తెలంగాణ వచ్చినప్పటి ఏడాదితో పోలిస్తే ఇప్పుడు మూడింతల ఆదాయం పెరిగింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ. 10.88 వేల కోట్ల ఇన్కమ్ రాగా.. 2020– 21లో ఏకంగా రూ. 27.28 వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లోనే రూ. 9,509 కోట్ల ఆదాయం సమకూరింది. మరింత ఆమ్దానీ రాబట్టుకోవాలని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అర్ధరాత్రి దాకా వైన్స్, బార్లు ఖుల్లా పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చేసింది. వీలు దొరికినప్పుడల్లా ఇటు వైన్స్, బార్ల సంఖ్యను పెంచుతూనే.. అటు లిక్కర్ రేట్లనూ పెంచేస్తోంది. సెల్స్ పెంచాలని ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు టార్గెట్లు పెడుతోంది.
పెరుగుడే పెరుగుడు..
రాష్ట్రంలో 2,216 వైన్ షాపులతోపాటు బార్లు, క్లబ్లు, పబ్లు ఉన్నాయి. వీటికి ఆయా జిల్లాల్లోని మద్యం డిపోల నుంచి సరుకు సరఫరా అవుతుంది. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో మద్యం అమ్మకాలు, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేవి. 2014–15లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 10.88 వేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. కానీ ఆ తర్వాత పెరుగుతూ వస్తోంది. 2018–19లో ఇది రూ. 20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఐదేండ్లలో డబుల్ అయింది. ఆ తర్వాత మరో రెండేండ్లలో మూడింతలైంది. 2020–21లో లిక్కర్ ఆమ్దానీ రూ. 27.28 వేల కోట్లకు చేరుకుంది. మొత్తంగా ఏడేండ్లలో రూ. 1,35,631 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
కరోనా ఇయర్లోనే హయ్యెస్ట్
నిరుడు కరోనాతో ప్రపంచమంతా ఆగమాగమైంది. అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. కానీ ఆబ్కారీ శాఖ మాత్రం మస్తు ఆమ్దానీ తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా టైంలోనే మస్తు ఇన్కం సమకూరింది. రాష్ట్రం వచ్చాక హయ్యెస్ట్ లిక్కర్ సేల్స్ 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డయ్యాయి. ఈ ఇయర్లో రూ. 27.28 వేల కోట్ల లిక్కర్ సేల్ అయింది. కరోనాతో నెలన్నర రోజుల దాకా వైన్స్, బార్లు బందైనా ఆదాయం మాత్రం పెరిగింది. ఒకే నెలలో ఎక్కువ మొత్తం లిక్కర్ అమ్మిన నెలగా 2020 డిసెంబర్ నిలిచింది. ఆ నెలలో రూ. 2,765.5 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా అయింది.
సమయం దొరికినప్పుడుల్లా రేట్ల పెంపు
సమయం దొరికినప్పుడుల్లా లిక్కర్ ధరలను ప్రభుత్వం పెంచుతోంది. మొత్తంగా మూడుసార్లు రేట్లు పెంచింది. 2016లో 10 నుంచి 15 శాతం, 2019 డిసెంబర్లో 20 శాతం ధరలు పెంచేసింది. ఆ తర్వాత 2020 మే లో కరోనా సమయంలో పాండమిక్ సెస్ పేరుతో మరో 22శాతం దాకా పెంచింది. అన్ని రాష్ట్రాల్లో పెంచిన కరోనా సెస్ తగ్గించినా తెలంగాణ మాత్రం కంటిన్యూ చేస్తోంది.
అధికారులకు టార్గెట్లు
లిక్కర్ సేల్స్, ఆదాయం పెంచాలని కిందిస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు టార్గెట్లు పెడుతున్నారు. ఎట్లయినా చేసి సేల్స్ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. టార్గెట్ రీచ్ కాకుంటే వివిధ కారణాలు చెప్పి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కిందిస్థాయి ఆఫీసర్లు టార్గెట్లను రీచ్ కావడానికి వైన్స్, బార్ల యజమానులపై ప్రెషర్ పెంచుతున్నారు. మద్యం అమ్ముడుపోవడానికి బెల్ట్ షాపులను కూడా ప్రోత్సహిస్తున్నారు.
అర్ధరాత్రి దాకా పర్మిషన్లు.. బార్లు పెంచిన్రు..
ఆదాయం పెంచుకోవడంలో భాగంగా వైన్స్, బార్ల వేళలను పెంచారు. అర్ధరాత్రి వరకు తెరిచేందుకు అనుమతించారు. గతంలో వైన్స్ ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసేసేవాళ్లు. ప్రస్తుతం హైదరాబాద్లో అర్ధరాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. సాధారణ రోజుల్లో బార్ల క్లోజింగ్ టైం అర్ధరాత్రి 12 గంటలకు ఉంటే.. హైదరాబాద్లో మాత్రం శుక్ర, శని, ఆదివారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉంటోంది. మరోవైపు రాష్ట్రంలో బార్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గతంలో 1,052 బార్లు ఉండగా.. కొత్తగా మరో 159 బార్లకు అనుమతిచ్చారు. ఇక ఎవరైనా పెద్ద లీడర్లతో చెప్పిస్తే ఎలైట్ బార్లకు వెంటనే పర్మిషన్ ఇస్తున్నారు.
బీర్లు తగ్గి.. లిక్కర్ పెరిగె..
తెలంగాణ వచ్చిన కొత్తలో లిక్కర్ కంటే బీర్లు అధికంగా అమ్ముడయ్యేవి. 2014లో 2.01 కోట్ల కేసుల లిక్కర్, 3.12 కోట్ల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. రానురాను బీర్ సేల్స్ తగ్గుతూ, లిక్కర్ అమ్మకాలు పెరుగుతున్నాయి. 2020–21లో 3.35 కోట్ల కేసుల లిక్కర్, 2.73 కోట్ల కేసుల బీర్లు అమ్మారు. ధరలు పెరగడంతో బీరు బదులు లిక్కర్కు అలవాటు పడుతున్నారని ఆబ్కారీ అధికారులు చెప్తున్నారు. గతంలో రూ. 90 ఉన్న బీరు ధర ఇప్పుడు రూ. 140కు చేరింది. మొన్నామధ్య రూ. 150 వరకు ఉండేది.