బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఓటర్ల జాబితా : సీనియర్ నేత డీఎస్ రెడ్డి

బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఓటర్ల జాబితా : సీనియర్ నేత డీఎస్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను ప్రకటించిందని బీజేపీ ముషీరాబాద్ సెగ్మెంట్ సీనియర్ నేత డీఎస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ట్యాంక్​బండ్​లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులతో కలిసి డీఎస్ రెడ్డి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు.

నకిలీ ఓటర్లను తొలగించాల్సింది పోయి అసలు ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.  కేంద్ర ఎన్నికల కమిషన్​ను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి న్యాయమైన ఓటరు జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, గౌరీ శంకర్, నరేశ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.