హైదరాబాద్, వెలుగు: ఎగ్జామ్ రిజల్ట్స్ టైంలో టెన్త్, ఇంటర్ స్టూడెంట్లు సూసైడ్ చేసుకోకుండా తీసుకుంటున్న చర్యలేమిటో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ లాయర్ ఎం.శంకర్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అలోక్ అరాధే బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా ఇంటర్ బోర్డు తరఫున కమిషనర్ నవీన్ మిట్టల్ కౌంటరు దాఖలు చేశారు. అందులో స్టూడెంట్ల ఆత్మహత్యలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. 2023 మార్చిలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఒత్తిడిని తగ్గించేందుకు స్టూడెంట్లు 8 గంటలు నిద్ర పోయేలా చూడాలని కాలేజీల మేనేజ్మెంట్లను కోరామన్నారు. కోర్టు స్పందిస్తూ.. ఆత్మహత్యల వల్ల రిజల్ట్స్ ప్రకటించకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పాలని పిటిషనర్ ను కోరింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.