
ధర్మసాగర్, వెలుగు : వరంగల్ సిటీ వాసులకు తాగునీటి సమస్య తీరింది. మంగళవారం అర్ధరాత్రి ధర్మసాగర్ 60ఎల్ఎండీ ఫిల్టర్ బెడ్ కు ఎల్ఎండీ వాటర్చేరుకోగా.. బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ ఎల్ఎండీ నుంచి ధర్మసాగర్ 20, 25.5 ఎల్ఎండీ ఫిల్టర్ బెడ్స్కు పంపిణీ చేశారు. ఫిల్టర్ బెడ్స్ లోకి నీరు రాగా వాటర్ ఫిల్టర్ చేసి ట్యాంకులు నింపే పనులు ప్రారంభించారు.
ఫిల్టర్ నీటిని వివిధ మండలాలకు సరఫరా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా ఎల్ఎండీ వద్ద గేట్ వాల్వ్ రిపేర్ కారణంగా వరంగల్ సిటీలోని పలు కాలనీలకు, పలు మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. మిషన్ భగీరథ, మున్సిపల్ ఇంజినీరింగ్ ఆఫీసర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనులు చేసి సమస్యను పరిష్కరించారు. ఎల్ఎండీ వాటర్ రాకతో వరంగల్ సిటీవాసులు ఆయా ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.