
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి లోకల్బాడీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం నల్గొండలో బీసీ సంఘాల సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, దేశవ్యాప్తంగా కులగణనపై బీసీ, కుల సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు బీసీ కులగణన డిమాండ్ ఉన్నా, ఎందుకు చేయలేదో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ సర్కార్ 23 శాతానికి రిజర్వేషన్లు తగ్గించి బీసీలను మోసం చేసిందని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో 32 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే అమలు చేయాలన్నారు. బీసీలకు 70 ఏండ్లుగా అన్యాయం జరుగుతోందని, ఏ ఒక్క కుటుంబాన్ని వదలకుండా కులగణన పూర్తి చేస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మాదగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.