- లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: పాడయిన గాడ్జెట్ల రిపేర్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నట్లు కన్జూమర్లు చెబుతున్నారు. బ్రాండెడ్ ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు వంటి టెక్నాలజీ గాడ్జెట్లు మూడుకి మించి తమ ఇంట్లో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోని 43 శాతం ఇళ్లల్లో మూడు లేదా అంతకు మించిన గాడ్జెట్లు ఉన్నాయని ఇందులో తేలింది. ఇవన్నీ అయిదేళ్లలోపు కొన్నవేనని ఆ కన్జూమర్లు చెప్పారని లోకల్ సర్కిల్స్ తన రిపోర్టులో పేర్కొంది.
ఆయా ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లకు రిపేర్లు అవసరమేనని వారు చెబుతున్నట్లు వివరించింది. బ్రాండెడ్ డివైస్ల రిపేర్ ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయని, దీంతో కొత్త డివైస్లు కొనుక్కుంటున్నట్లు కన్జూమర్లు ఈ సర్వేలో చెప్పారు. ఇంట్లో అయిదేళ్లలోపు కొన్న డివైస్లు (ల్యాప్టాప్, డెస్క్టాప్, టాబ్లెట్, స్మార్ట్ఫోన్, ప్రింటర్) ఉన్నాయా అనే ప్రశ్నకు వచ్చిన సమాధానాలను ఎనలైజ్ చేసినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. పాడైన డివైస్లను లోకల్గా సర్వీస్ చేయించుకోవాలన్నా, కంపెనీలకు పంపి సర్వీసు చేయించుకోవాలన్నా కష్టతరంగా మారడంతో కొత్త వాటినే కొనుక్కోవడం మేలనే నిర్ణయానికి కన్జూమర్లు వస్తున్నట్లు వివరించింది. దేశంలోని 309 జిల్లాల నుంచి 34000 మంది కన్జూమర్లు ఈ సర్వేలో భాగం పంచుకున్నట్లు పేర్కొంది.
భాగం పంచుకున్న వారిలో 61 శాతం మంది పురుషులుండగా, 39 శాతం మంది మహిళలూ ఉన్నారని లోకల్ సర్కిల్స్ తెలిపింది. దేశంలో రిపేర్ సర్వీస్విషయంలో కన్జూమర్ల ఇబ్బందులు పరిష్కరించడానికి కన్జూమర్ ఎఫెయిర్స్ మినిస్ట్రీ ఒక ఫ్రేమ్వర్క్ తేవాలనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో లోకల్ సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించడం విశేషం. మాన్యుఫాక్చరర్లందరూ తమ ప్రొడక్టుల డిటెయిల్డ్ డ్రాయింగ్స్ను వాటిని అమ్మేటప్పుడే కన్జూమర్లకు ఇవ్వాలని, అప్పుడే డివైస్ల రిపేర్లకు మాన్యుఫాక్చరర్ల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని మినిస్ట్రీ అభిప్రాయపడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి జులై 9 మధ్యలో సర్వే నిర్వహించగా, టైర్ 1 సిటీల నుంచి 47 %, టైర్ 2 సిటీల నుంచి 31 % మంది కన్జూమర్లు పాల్గొన్నారు.