కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ తో గరీబోళ్లు ,దిగువ,మధ్య తరగతి వాళ్ల జీవితాలపై పెద్ద దెబ్బే పడింది. పనుల్లేక, చేతిలో పైసల్లేక లక్షల మంది లబోదిబోమంటున్నరు. ‘ఇంకెంత కాలం ఇంట్లో ఉండుడు.. ఇట్లయితే కుటుంబమెట్లగడుస్తది’ అనుకుంట దిక్కులు చూస్తున్నరు. జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన బంద్ మూడు వారాలుగా కొనసాగుతోంది. ఈ నెల15 నుంచి ఊరట వస్తుందని ఎదురుచూసిన వాళ్లంతా లాక్ డౌన్ తో పొడిగించడంతో మళ్లీ ఆందోళనలో మునిగిపోయారు. ఇంటికిరాయిలు,అప్పులపై వాయిదాలు, చిట్టీల డబ్బులు చెల్లించలేక ఆవేదనలో పడ్డారు. రాష్ట్రంలో ప్రధాన రంగాలపై ఆధారపడ్డ 70 శాతం మంది అసంఘటిత కార్మికులు,వేతన జీవులు,చిరు వ్యాపారులందరిదీ ఇదే దుస్థితి.
పెద్దసిటీలు, పట్టణాల్లో చాయ్ దుఖాణాలు, పాన్ షాపులు నడిపేవాళ్ల నుంచి ఆటో,క్యాబ్ డ్రైవర్లు, అడ్డా కూలీలు, వివిధ వృత్తులను నమ్ముకున్న వాళ్లంతా తీవ్ర ఇబ్బందుల్లో మునిగిపోయారు. గుడుల దగ్గర పూలు, పూజ సామాను అమ్ముకునే వారి నుంచి చిరు వ్యాపారుల దాకా పనిలేక, ఇల్లు గడిచే దారిలేక దిగులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో లక్షల మంది భవననిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వారు పనికో ల్పోయారు. బడా రెస్టారెంట్లు, మెగా మాల్స్ లో పనిచేస్తున్న వలస కార్మికులు తిండి కోసం వెతుక్కుంటున్నారు. పరిస్థితులు ఎప్పుడు కుదుట పడతాయో, లాక్ డౌన్ ఎప్పుడు ఆగిపోతుందో, పనిచేసుకుని నాలుగుపైసలు చేతికొచ్చేదెప్పుడోనని లక్షల మంది ఎదురుచూస్తున్నారు.
అడ్డాకూలీలది అరి గోస
హైదరాబాద్తో పాటు అన్నిప్రధాన నగరాలు, పట్టణాల్లో లక్షలాది మంది అడ్డా కూలీలు రోజువారీ పనులకు వెళ్తూ పొట్టపోసుకుం టున్నారు. వారందరికీ ఇప్పుడు పనిలేకుండా పోయింది. వాళలో వేలాది మంది నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లే వాళ్లు ఇంకా పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్లో ఉన్నారు. లాక్ డౌన్పొడిగింపుతో ఇంకొన్ని రోజులు వాళ్లు బయటికి రాని దుస్థి తి ఉంది.
క్యాబ్స్ పూర్తిగా కుదేలు
లాక్డౌన్తో క్యాబ్స్పై పెద్ద దెబ్బ పడింది. ఎమర్జెన్సీ వెహికల్స్ తప్ప ఇతర వాహనాలు రోడ్డెక్కడం లేదు. దీనివల్ల పనులు కోల్పోయి రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఇండ్లకే పరిమితమయ్యారు. కార్ల ఈఎంఐలు కట్టలేక డ్రైవర్లు బాధ పడుతున్నరు. మరో వైపు క్యాబ్సంస్థలు మాత్రం రోజువారీ లీజు డబ్బులు కట్టాలని పట్టుపడుతున్నాయి. కట్టలేనివారి బండ్లను సీజ్చేశాయి. మొత్తంగా క్యాబ్స్బంద్ అయితే తామెక్కడి నుంచి డబ్బులు తెచ్చి కడతామని డ్రైవర్లు వాపోతున్నారు. మూడు నెలల వరకు లీజ్డబ్బులు అడగకుండా మినహాయింపు ఇవ్వాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ ఇప్పటికే విజ్ఞ ప్తిచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు అధికారులు, ఇతర ఉద్యోగుల వద్ద పనిచేసే డ్రైవర్లకు కూడా లాక్డౌన్తో పనిపోయింది. దాంతో పూర్తి జీతం ఇవ్వలేమని, ఎంతో కొంత ఇచ్చి, సర్దుకోవాలని ఓనర్లు చెప్తున్నారని హైదరాబాద్లోని విద్యానగర్ కు చెందిన డ్రైవర్ రాజు తెలిపారు.
బార్బర్ షాపులు బంద్
రాష్ట్రవ్యాప్తంగా 50 వేల వరకు బార్బర్ (హెయిర్ సెలూన్లు ) షాపులు ఉండగా.. ఒక్క హైదరాబాద్లోనే 30 వేలకుపైగా ఉన్నాయి. ఒక్కోషాపు కిరాయి రూ.10 వేల వరకు ఉంటుంది. లాక్ డౌన్తో షాపు తీయకున్నా కిరాయి కట్టాల్సిన పరిస్థితి ఉందని హైదరాబాద్ నల్లకుంటకు చెందిన శంకర్ వాపోయారు. తన వద్ద పనిచేసే మరో ఇద్దరికికూడా పనిలేకుండా పోయిందని చెప్పారు. లాక్డౌన్ పొడిగిస్తే తమకు పూట గడవడం కూడా కష్టమేనని అంటున్నారు.
ఇతర పనులు చేసుకునేవాళ్లకూ దెబ్బ
పార్కులు, ఇతర పబ్లిక్ ప్లేస్ లలో పల్లీలు, పుట్నాలు, ఇతర తినుబండారాలు అమ్మే వాళ్లు, సెల్ఫోన్లకు గార్డులు వేసేవాళ్లు, గల్లీల్లో తిరిగి తినుబండారాలు అమ్మేవాళ్లు, స్వగృహ ఫుడ్ సెంటర్లకు తినుబండారాలు రెడీ చేసి పంపేవాళ్లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు, రోడ్లపై ఐస్క్రీమ్ అమ్మేవారు తదితర వేల మందికి పనిలేకుండా పోయింది. వారంతా ప్రభుత్వం ఇచ్చే రేషన్తోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బతుకుదెరువు చూపని ‘కూలర్’
ఏటా ఎండాకాలంలో కూలర్ల రిపేర్లు, వాటిల్లో ఉపయోగించే గడ్డి, ఇతర వస్తువులతో వేల మంది బతికేవాళ్లు. రోడ్లపై టెంట్లు వేసికూలర్లు అమ్మేవారు. ఇప్పుడు వారందరి పరిస్థితి దారుణంగా మారింది. ఫిబ్రవరిలోనే కూలర్లు, గడ్డికి అడ్వాన్సులు ఇచ్చామని నాంపల్లికి చెందిన ఉస్మాన్ తెలిపాడు. కానీ సరుకు వచ్చే అవకాశం లేదని, విక్రయాలు, రిపేర్లు చేసే పరిస్థితి లేదని పేర్కొన్నాడు
డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు దెబ్బ
లాక్డౌన్తో హోటళ్లనీ మూతపడి ఫుడ్డెలివరీ బాయ్స్ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే డోర్ డెలివరీకి అందుబాటులో ఉన్నాయి. అయితే బయటి ఫుడ్పై జనంలో ఆందోళనతో ఆర్డర్లు తగ్గాయి . దీంతో స్విగ్గీ, జొమాటో, డొమినోస్ వంటివాటిల్లో పనిచేసే సుమారు 50 వేల మందిపై ఎఫెక్ట్ పడింది. ఫుడ్ ఆర్డర్స్ ఉంటే రోజుకు రూ.300 నుంచి 600 వరకు సంపాదించే వారిమని, లాక్ డౌన్ తో దెబ్బ పడిందని జొమాటో లో పనిచేసే వినోద్ ఆవేదన వ్యక్తంచేశాడు.
స్వీట్ షాపులు, బేకరీలకు భారీ నష్టాలు
రాష్ట్రంలో వేలాది స్వీట్ షాపులు, బేకరీలు ఉన్నాయి. వాటి నిర్వాహకులు లాక్ డౌన్ తో భారీగా నష్టపోయారు. జనతా కర్ఫ్యూకు కొన సాగింపుగా లాక్డౌన్ విధించడంతో అప్పటికే తయారు చేసిన స్వీట్లు, బ్రెడ్ఐటమ్స్ను అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. చాలా ఐటమ్స్పాడై పోవడంతో వృథాగా పడేశారు. రాజస్థాన్ , కర్నాటక నుంచి వచ్చిస్వీట్షాపులు, బేకరీలు పెట్టినవాళపై ఎఫెక్ట్ పడింది.
ఫొటోగ్రాఫర్ల దుస్థితి ఇదీ
‘‘పెండ్లిళ్ల సీజన్లోనే పని దొరికేది. కరెక్ట్ సీజన్లో లాక్డౌన్మొదలైంది. షాపుల కిరాయిలు కట్టుడు కష్టంగనే ఉన్నది. సీజన్ అని పోయిన నెలలో 2 లక్షలు అప్పు తెచ్చి కొత్త కెమెరా కొన్న. నెలకు రూ.4 వేల మిత్తి కట్టాల్సి వస్తోంది. కరెక్టుగా పనిచేస్తే ఈ సీజన్లో అప్పు దగ్గరపడేది. ఇప్పుడు కిరాయిలు, అప్పులు మీద పడ్డయి ’’ అని హైదరాబాద్ కు చెందిన మాచర్ల రాజు అనే ఫొటోగ్రాఫర్ వాపోయారు.
పాన్ షాపులు తెరుచుకునేదెప్పుడో..
రాష్ట్రంలో సుమారు రెం డు లక్షల వరకు పాన్ షాపులు ఉన్నాయి. పాన్లు, సిగరెట్లు, ఇతర చిన్నాచితకా వస్తువులు అమ్మి బతుకుతుంటారు. ఇప్పుడు వాళ్లందరికీ పని లేకుండా పోయింది. వచ్చే నెలలో లాక్డౌన్ ఎత్తేసినా కొన్నిఆంక్షలు విధించే అవకాశముంది. దానితో పాన్షాపు లపై ఎఫెక్ట్ పడుతుందని.. అదే జరిగితే ఇంటి కిరాయి కట్టడం, కుటుంబానికి తిండిపెట్టడం కూడా కష్టమేనని వారు వాపోతున్నారు.
ఇంటి పనోళ్ల కు తిప్పలు
ఇండ్ల లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడిచే పనులు చేసే డొమెస్టిక్ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు. అందులో ఒక్క హైదరాబాద్ లోనే ఐదున్నర లక్షల మంది ఉంటారని అంచనా. కరోనా వైరస్ భయంతో ఇంటి యజమానులంతా జనతా కర్ఫ్యూ నాటి నుంచే ఇంటి పనివాళ్లను బంద్ చేయించారు. కొందరు మాత్రం సగం జీతం ఇవ్వగా.. మరికొందరు మొత్తంగా ఇవ్వడం లేదు. పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితిలో వారంతా అర్ధా కలితో బతుకుతున్నారు. తాను రోజూ నాలుగు ఇండ్ల లో పనిచేస్తానని, కరోనా భయంతో యజమానులు పనికి రానివ్వడం లేదని, ఇద్దరు మొత్తం జీతమిస్తే.. మరో ఇద్దరు చేసిన రోజులకే లెక్కగట్టి ఇచ్చారని హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి లో పనిచేసే పద్మ చెప్పింది.
స్కూలు బిల్డింగ్ల కిరాయిలెట్ల ?
రాష్ట్రవ్యాప్తంగా 10,500 వరకు ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో కార్పొరేట్ స్కూల్లు పోగా తొమ్మిది వేలకుపైగా చిన్నాచితక స్కూళ్లే. వీటిల్లో లక్షన్నర మంది వరకు టీచర్లు, ఇతర స్టాఫ్ పనిచేస్తున్నట్టు సంబంధిత సంఘాలు చెప్తున్నా యి. ఈ టీచర్లు, స్టాఫ్కు ఎంతో కొంత జీతాలు ఇచ్చేందుకు మేనేజ్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ బిల్డింగుల కిరాయిలు కట్టడమే కష్ట మని నిర్వాహకులు చెప్తున్నారు . స్కూల్ ఫీజులు వసూలు చేసుకునే టైంలో లాక్డౌన్ పెట్టడంతో జీతాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.
ఆటో చక్రం ఆగింది
రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల ఆటోలుండగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 2 లక్షలు ఉన్నాయి. లాక్ డౌన్కు ముందు రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాయించే ఆటో డ్రైవర్లకు 20 రోజులుగా పనిలేకపోవడంతో బతుకులు ఆగమవుతున్నాయి. ఆటోల ఫైనాన్స్ కిస్తీలు, ఇంటి కిరాయిలు, ఇంటికి సరుకుల కోసం తిప్పలు పడుతున్నారు. జనతా కర్ఫ్యూ నాటినుంచి ఆటోను బయటకు తీయలేదని, ఏ పనీ లేని తమను సర్కారు ఆదుకోవాలని వెంకన్న అనే ఆటో డ్రైవర్ విజ్ఞప్తి చేశారు. తాను 20 ఏండ్ల నుంచి ఆటో నడుపుతున్నానని, ఇంట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని నర్సయ్య అనే మరో ఆటోడ్రైవర్ వాపోయాడు. ఆటో ఫైనాన్సే నెలకు రూ.8,800 కట్టాలని, లాక్డౌన్ ఇంకా పెడితే తమలాంటోళ్ల బతుకేంటని పేర్కొన్నార
జ్యూస్ సెంటర్లు, సోడా బండ్లపై ఎఫెక్ట్
రాష్ట్రవ్యాప్తంగా ఎండాకాలంలో జ్యూస్సెంటర్లు, సోడా బండ్లపై ఆధారపడి వేల మంది బతికేవారు. ఇప్పుడు ఎక్కడా జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశమే లేదు. సీజనల్ బిజినెస్ చేసి ఏడాది గ్రాసం సంపాయించుకునే వారికి పనిలేకుండా పోయింది.
