- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల
- రక్షణ రంగానికి దండిగా నిధులు.. సాగుకు అంతంతే.. హెల్త్, ఇతర సెక్టార్లకు ఫర్వాలేదు
- ఐదేండ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం.. కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
- ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి మార్పుల్లేవ్.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహం
- అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్.. ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల
లోక్సభ ఎన్నికలకు రెండు నెలల టైమే ఉండటంతో నొప్పించక.. ఒప్పించక సాదాసీదాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను తీసుకువచ్చింది. ఎలాంటి వరాలు లేవు.. వాతలూ లేవు. కొత్త పథకాలు లేవు.. సామాన్యులపై పెద్దగా భారమూ లేదు. 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని, 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ ఎదుగుతుందని అన్నారు. పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రజల ఆదాయం 50 శాతం పెరిగిందని పేర్కొన్నారు.
బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి రూ. 6 లక్షల కోట్లకుపైగా కేటాయించారు. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిపారు. కొత్తగా 2 కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టిస్తామని, రూఫ్టాప్ సోలార్ స్కీమ్ కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తామని ప్రకటించారు. ట్యాక్స్పేయర్స్కు గత బడ్జెట్లోని పద్ధతినే రిపీట్ చేశారు. రూ. 7 లక్షల వరకు (కొత్త సిస్టమ్ ప్రకారం) పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ చెల్లింపుల్లో కొంత ఊరట లభిస్తుందని వేతన జీవులు భావించినా.. నిరాశే ఎదురైంది.