రెండు దశల్లో కులగణన.. డీలిమిటేషన్‌‌‌‌కు కీలకం...

రెండు  దశల్లో కులగణన.. డీలిమిటేషన్‌‌‌‌కు కీలకం...

మన దేశంలో ప్రతి పదేండ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరిసారి 2011లో దేశ జనాభాను లెక్కించారు. మళ్లీ 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. అప్పట్లో దానికి సంబంధించిన ప్రక్రియ 2020లోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫస్ట్ ఫేజ్‌‌‌‌ 2020 ఏప్రిల్–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో,  సెకండ్ ఫేజ్‌‌‌‌ 2021 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు షెడ్యూల్ రెడీ చేసింది. కానీ దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించడంతో వాయిదా వేసింది. 

మళ్లీ ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత జనగణన జరగనుంది. దీనికి రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే 2025–26 బడ్జెట్‌‌‌‌లో మాత్రం రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ బడ్జెట్ పెద్ద సమస్య ఏమీ కాదని అధికారులు పేర్కొంటున్నారు. 

ప్రతిపక్షాల ఒత్తిడితో..

జనాభా లెక్కలు ఎప్పుడు చేపడతారని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చాయి. కరోనా పూర్తిగా తొలగిపోయినా కేంద్రం జనగణన ప్రక్రియ చేపట్టడం లేదని మండిపడ్డాయి. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు 
డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే జనగణనతో పాటు కులగణన చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ 30న ప్రకటించింది. 

డీలిమిటేషన్‌‌‌‌కు కీలకం.. 

2027లో చేపట్టే జనగణన కీలకంగా మారనుంది. ఈసారి జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనుండడంతో దేశవ్యాప్తంగా ఏయే వర్గాల జనాభా ఎంతుందో తేలనుంది. అలాగే లోక్‌‌‌‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఈ డేటానే కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. కాగా, చివరిసారి 1971లో డీలిమిటేషన్ చేశారు.  ఆ తర్వాత 2001 వరకు దాన్ని వాయిదా వేశారు. మళ్లీ దాన్ని 2026 వరకు పొడిగించారు.