హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బండి భగీరథ్కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ హైదరాబాద్ నుంచి పారిపోకుండా పోలీసులు ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఏ ఎయిర్ పోర్టులో భగీరథ్ కనిపించిన తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు మెన్షన్ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్కు హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. శుక్రవారం సుదీర్ఘంగా వాద ప్రతివాదనల అనంతరం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును గురువారం వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈలోగా, బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
పోలీసుల దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరిస్తారని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారం కాకుండా, శనివారమే తీర్పు చెప్పాలని కోరితే చూద్దామని పేర్కొంది. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి వెల్లడించారు.
