ఆధ్యాత్మికం : అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు నేను మళ్లీ పుడతా.. దుష్ట సంహారం చేస్తా

ఆధ్యాత్మికం : అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు నేను మళ్లీ  పుడతా.. దుష్ట సంహారం చేస్తా

మానవులకు అనేక జన్మలు ఉంటాయి.  ప్రతి జన్మ కూడా కర్మ ఫలం అనుగుణంగా జీవితం కొనసాగుతుందని శ్రీకృష్ణుడు అర్జునిడికి ఉపదేశించాడు. తాను ఎందుకు పుట్టాడో వివరిస్తూ.. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు తాను పుడతానని చెప్పాడు శ్రీకృష్ణుడు.

నీకు .. నాకు కూడా ఎన్నో జన్మలు జరిగాయి.  నీకు గుర్తు లేదు. నాకు గుర్తు ఉన్నాయి.  అని అర్జునుడితో కృష్ణుడు చెప్పాడు. తను ఎందుకు పుట్టవలసి వచ్చిందో, ధర్మం అంటే ఏమిటో మళ్ళీ అర్జునుడికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా కృష్ణుడు వివరించటం ప్రారంభించాడు.

ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటాను అంటే, భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు అవతరిస్తానని చెప్పాడు.  అవతరించటం అనే మాటకి దిగిరావటం అని అర్థం. భూలోకాని కంటే పైన ఉన్న లోకంలో నుండి ఈ లోకానికి రావటం అని అర్థం చేసుకోవాలి. సామాన్య జీవులు పుడతారు. కానీ, అప్పటివరకు ఎక్కడ ఉన్నారో. శరీరం వదిలిన తరువాత ఎక్కడికి వెళ్తారో వాళ్లకి తెలియదు. వారికి జన్మ బంధం తప్పనిసరి. 

పూర్వ జన్మల కర్మలననుసరించి జన్మిస్తారు. పుట్టుకలో స్వేచ్ఛ ఉండదు. భగవంతుడికి కర్మఫలం అనుభవించ వలసిన పని లేదు. అందుకని భూభారం తగ్గించి, ధర్మం పునః ప్రతిష్ఠించవలసిన అవసరం కలిగినప్పుడల్లా తగిన రీతిలో పుడుతుంటాడు.

ధర్మానికి హాని కలిగినప్పుడు అవతరించడం గురించి తెలుసుకునేముందు. ధర్మం అంటే ఏమిటో తెలియాలి కదా. ధర్మం అంటే ధరించేది, ధరింపబడేది అని అర్థాలున్నాయి. ఏ నియమాన్ని అనుసరించి ఈ సృష్టి ఈ విధంగా నిలిచి ఉన్నదో అది ధర్మం. భూమి అంతరిక్షంలో అస్తవ్యస్తంగా అటు ఇటు పోకుండా నిర్దిష్టమైన కక్ష్యలో నిర్దుష్టంగా నడవటానికి కారణం? అట్లాగే తిరగటం దాని ధర్మం. అంటే సహజ లక్షణం. ప్రకృతి సహజమైన నియమం. దానిని పాటించటమే దాని ధర్మం. సృష్టిలోని సమస్తం ధర్మాన్ని అనుసరించి నడుస్తున్నాయి. 

మానవుడు తను కూడా దానిని అనుసరించినంత కాలం అంతా సవ్యంగా ఉన్నట్టే ఎప్పుడైతే జీవులు ప్రకృతి సహజంగాకాక వికృతంగాప్రవర్తించటం మొదలుపెడతారో అప్పుడు ధర్మచ్యుతి జరుగుతుంది.  అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భూభారం పెరుగుతుంది. జనాభా పెరుగుదల వల్ల భూభారం పెరగదట. ఈ మాట ఒక సందర్భంలో భూమాత స్వయంగా చెప్పింది. భూభారం పెరిగినప్పుడు దానిని తగ్గించి ధర్మాన్ని నిలబెట్టటానికి తాను దిగివస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు.

►ALSO READ | Good Fruit: పైనాపిల్.. సూపర్ ఫ్రూట్.. ఇది తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు..

భగవంతుడు అవతరించటం అంటే... శంఖం, చక్రం, గద వంటి ఆయుధాలు, ఆభరణాలతో మనం ఫొటోల్లో చూసే విధంగా అవతరిస్తాడు అనుకోవద్దు. సందర్భాన్ని బట్టి, అంటే దేశ కాల ప్రాంతాల అవశ్యకతను బట్టి, భిన్నమైన రూపాల్లో అవతరిస్తాడు. ఆ అవతారాలు కూడా ఒకే రకమైనవి కావు. కొన్ని ఆవేశావతారాలు, కొన్ని అంశావతారాలు, మరికొన్ని పూర్ణావతారాలు, ఇంకకొన్ని పరిపూర్ణావతారాలు. అన్నింటిలోనూ భగవత్తత్త్వం నిండి ఉంటుంది.

ఇంకా సరిగ్గా చెప్పాలంటే, అవసరాన్ని బట్టి భగవంతుడు ధర్మాన్ని ప్రతిష్ఠించటం కోసం తగినది అనిపించిన రూపం ఏదైనా ధరిస్తాడు. మత్స్య, కూర్మ, వరాహాది రూపాలలో రాలేదూ? ఈ విధంగా దిగిరావటంలో ప్రయోజనం ఏమిటి? ధర్మాన్ని అనుసరించే సాధువులని కాపాడటం, ధర్మానికి హాని కలిగించి, ధర్మాన్ని అనుసరించే వారికి ఇబ్బంది కలిగించే వారిని శిక్షించటం, తద్వారా ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించటం కోసం జన్మిస్తానని చెబుతాడు.

 ధర్మప్రతిష్ఠాపన కోసం ప్రతియుగంలోనూ దిగివస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలతో అర్థమయ్యే అంశం ఒకటి ఉంది. అవతరించాను అని భూతకాలంలో చెప్పలేదు. అవతరిస్తాను అని తద్ధర్మకాలంలో చెప్పాడు. అంటే ఇంతకు ముందు అవతరించాడు, ఇప్పుడు అవతరించాడు. ఇక ముందు కూడా అవసరమైనప్పుడు అవతరిస్తాడు. ఎప్పుడు. ఎట్లా అనేది సందర్భాన్ని అనుసరించి ఉంటుంది. అందుకే మానవాతీతమైన ఘనకార్యాలు సాధించిన వారిని అవతారపురుషులతో పోలుస్తారు.

"తెలిసి, ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి భూమి మీద పుట్టి తను ఆచరించే కర్మము దివ్యము" అని చెప్తాడు కృష్ణుడు. తనవే కాదు, అందరి జన్మలు, కర్మలు కూడా తనకు చెందినవే అని అంటాడు. అయితే అందరి జన్మలు, అన్ని కర్మలు దివ్యమైనవే అవ్వాలికదా. 

ప్రాకృతాలు ఎట్లా అవుతున్నాయి? అనే సందేహం రావటం సహజం. కర్మాచరణ చేస్తున్నప్పుడు ఉన్న భావనను బట్టి ఆ భేదం వస్తుంది. 'ఈ పని నేను చేస్తున్నాను' అనే భావనతో చేసినప్పుడు ఆ కర్మసామాన్యకర్మ లేక ప్రాకృతకర్మ అవుతుంది. నా చేత చేయబడుతోంది అన్న భావనతో గాని, అసలు ఎటువంటి అభిప్రాయం లేకుండా గాని చేస్తే అది దివ్యకర్మలో భాగం అవుతుంది. 

►ALSO READ | ఆగస్టు 13 లెఫ్ట్ హ్యాండర్స్ డే: లెఫ్ట్ హ్యాండ్.. లక్కీ హ్యాండ్..!

భగవంతుడి గురించి, దివ్యకర్మ గురించి తెలుసుకున్న వారే తత్త్వవేత్తలు. అటువంటి వారు శరీరం వదిలిన తరువాత పునర్జన్మ పొందరు. అయితే ఏమవుతారు? అంటే 'నన్నే' చేరుకుంటారు. నన్ను చేరుకుంటారు అనగానే ఇక తిరిగి పుట్టరా? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. తప్పనిసరిగా కర్మఫలాలని అనుభవించటం కోసం పుట్టవలసి ఉండదు. పరమాత్ముడి దివ్యప్రణాళికలో భాగస్వామి అయి, అవసరానికి తగినట్టు పుట్టటం జరుగుతుంది. స్వచ్ఛందంగా స్వీకరించిన జన్మ కనుక, ఆ సంగతి స్ఫురణలో ఉండి. కర్తవ్యోన్ముఖంగా కర్మాచరణం సాగిపోతుంటుంది.

ఎరుక కలిగి చేయటం వల్ల కర్మము బంధం కాదు. దివ్యం అవుతుంది. శ్రీమహావిష్ణువు ఇన్ని అవతారాలు ధరించి, ఎన్ని చేసినా ఏవి తనకి అంట లేదు కదా. దానిలో కిటుకు ఇదే. నేను చేస్తున్న పని దివ్యప్రణాళికలో భాగం అనుకుని చేసినప్పుడు దాని ఫలితం అనుభవించటానికి తప్పనిసరిగా మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఎంత సులభం! ఆచరణలో మాత్రం ఎంతో కష్టం. ప్రయత్నం చేస్తూ ఉంటే సరిపోతుందని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.