యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు.. ఫలితమే ఇంపార్టెంట్: CDS చౌహాన్

యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు.. ఫలితమే ఇంపార్టెంట్: CDS చౌహాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‎పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 3) పూణేలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడీఎస్ చౌహాన్ ప్రసంగిస్తూ.. యుద్ధంలో కలిగే నష్టాల కంటే.. ఫలితమే ముఖ్యమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‎ మ్యాచులో ఎన్ని రన్స్ తేడాతో, ఎన్ని వికెట్ల తేడాతో గెలిచామా అన్నది కాదని.. గెలిచామా లేదా అన్నది ఇంపార్టెంట్ అని ఉదహరించారు. 

కేవలం ఒక వికెట్ తేడాతో గెలిచినా.. ఒక్క  రన్ తేడాతో విజయం సాధించినా.. అక్కడ గెలుపు ముఖ్యమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాల నష్టాల గురించి తనను ప్రశ్నించినప్పుడు కూడా ఇదే చెప్పానని.. మనం ఎన్ని విమానాలను కోల్పోయా అన్నది ముఖ్యం కాదని.. ఆపరేషన్ ఫలితం ఇంపార్టెంట్ అని అన్నారు. సైనిక చర్యలో నష్టం ముఖ్యం కాదని.. ఫలితమే ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల అనిల్ చౌహాన్ సింగపూర్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.

పాకిస్తాన్‎పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎లో భారత్ కూడా ఫైటర్ జెట్‎లను కోల్పోయిందంటూ సీడీఎస్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆపరేషన్ సిందూర్‎లో భారత్ యుద్ధ విమానాలు కోల్పోయిందని సీడీఎస్ మాటలను బట్టి అర్థం అవుతోందని.. అయితే.. ఎన్నో ఫైటర్ జైట్‎లు కోల్పోయామో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రమైన క్రూరత్వం చర్యగా ఆయన అభివర్ణించారు. బాధితులను వారి కుటుంబాలు మరియు పిల్లల ముందే మతం అడిగి కాల్చి చంపారని గుర్తు చేశారు. ఇది ఈ ఆధునిక ప్రపంచానికి ఒక విధంగా ఆమోదయోగ్యం కాదని.. ఈ ఘటన సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైందన్నారు. ఇది ఒక్క భారతదేశానికి వ్యతిరేకంగా జరిగినఉగ్రవాద చర్య కాదని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలలో కూడా ఒకటి రెండు ఉగ్రదాడులు జరిగి ఉండొచ్చు. కానీ భారత్ ఎన్నో ఉగ్రదాడులకు గురైందని.. దాదాపు 20 వేల మంది మరణించారని అన్నారు. 

పహల్గాం ఉగ్రదాడికి ముందే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ భారత్, హిందువులపై విషం చిమ్మారని ఫైర్ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ కు భారీ నష్టం చేకూర్చిందని.. ఆపరేషన్ సిందూర్ కొనసాగితే కష్టమని భావించి పాక్ కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు. పాక్ ఉగ్రవాదం, అణ్వాయుధ బ్లాక్ మెయిల్‎కు భారత్ ఎన్నటికీ భయపడబోదని తేల్చి చెప్పారు. 
పాకిస్థాన్ ఇకనైనా ఉగ్రవాదాన్ని పోత్సహించడం ఆపాలని హితవు పలికారు.