- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
కన్న తల్లి పోషణను విస్మరిస్తే ఆమెకు చెందిన ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సమర్థిస్తూ ఈ తీర్పు వెలువరించింది.
తిరుప్పూర్ జిల్లా మలైపేట్కు చెందిన రాజమ్మాళ్ తన మూడెకరాల భూమిని కుమార్తె సుగుణ పేరుతో 2016లో రిజిస్ట్రేషన్ చేయించింది. అంతకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తల్లి పోషణను కుమార్తె చూసుకోవాలి.
కానీ, ఆమె పట్టించుకోవడం లేదని, ఆస్తి రిజిస్ర్టేషన్ రద్దు చేయాలని రాజమ్మాళ్ ఉడుమలైపేట్ రెవెన్యూ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం రిజిస్ర్టేషన్ ని రద్దు చేయాలని ఆఫీసర్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుగుణ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి విచారించి రెవెన్యూ ఆఫీసర్ నిర్ణయాన్ని సమర్థించారు. తల్లిని పట్టించుకోని కుమార్తెకు ఆస్తిపై ఎలాంటి హక్కులుండవని స్పష్టం చేశారు.