జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామం.. రాయదుర్గం పీఎస్లో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామం.. రాయదుర్గం పీఎస్లో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారీ ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మృతిపై విచారణ చేయాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ‘‘నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు. ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోపీనాథ్​మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్​ చేశారు.

కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే.. గోపీనాథ్​ తల్లి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ గానీ, బీఆర్​ఎస్​లోని ఇతర ముఖ్యనేతలు గానీ స్పందించకపోవడం చర్చకు దారి తీసింది. తన కొడుకుది సహజ మరణం కాదని, మిస్టరీ అని, ఎలా చనిపోయాడో తమకు తెలియదని రెండురోజుల కింద మాగంటి గోపీనాథ్ తల్లి మీడియా ముందు కంటతడిపెట్టారు.

తన కొడుకు ఆస్పత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడనే విషయం ఇతరులు చెప్తేనే తనకు  తెలిసిందని, అంతేకాకుండా.. ఆస్పత్రికి వెళ్తే కన్నతల్లి అయిన తనను కొడుకు వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిమార్లు ప్రాధేయపడినా వెళ్లనీయలేదన్నారు. ‘‘ఒకసారి కేటీఆర్ కన్పిస్తే ఆయన దగ్గరకు వెళ్లి, నా కొడుకును చూడనియ్యటంలేదని చెప్తే.. ఆయన కనీసం పట్టించుకోలేదు. కేటీఆర్ వచ్చి వెళ్లాక గోపీనాథ్​ మరణ వార్తను ప్రకటించారు.. దీని వెనుక ఏం జరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలి’’ అని మాగంటి గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు.

‘‘నా కొడుకు  చనిపోయేటప్పుడు అతనికి 63 ఏండ్లు. నాకు  92 ఏండ్లు.. మూడు రోజులు నా కొడుకు చూపు కోసం పరితపించినా  నన్ను లోనికి రానివ్వలేదు” అని తెలిపారు. ఆమె ఈ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీ దగ్గరపడ్తున్న వేళ ఈ అంశం పార్టీల చేతికి బలమైన అస్త్రంలా మారింది.