
మహాభారత్(Mahabhrat) సీరియల్లో శకునిగా నటించిన నటుడు గుఫి పైంటాల్(Gufi Paintal) (80) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజులుగా ఐసీయూలో ఉన్న గుఫి.. జూన్ 5 ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని సమాచారం. గుఫి మరణవార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు.
1975లో వచ్చిన రఫూ చక్కర్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. గుఫీ సినిమాలతో పాటు పలు టీవీ షోలలో కూడా నటించాడు. బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ, జే కనియాలాల్ షోలలో కనిపించాడు. ఇక మహాభారత్ సీరియల్లో ఆయన చేసిన శకుని పాత్ర ప్రేక్షకుల్లో ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
80 సంవత్సరాల వయసున్న గుఫి పైంటాల్ కు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు ఉన్నారు. జూన్ 5న సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్లోని శ్మశానవాటికలో గుఫి అంత్యక్రియలు జరగనున్నాయి.