
- మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఘటన
సాంగ్లి: రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసును మరిచిపోకముందే మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన మూడు వారాలకే భర్తను భార్య గొడ్డలితో నరికి చంపేసింది. రాధిక అనే యువతి అనిల్ లోఖండేను మే 23న పెళ్లి చేసుకుంది. జూన్10వ తేదీన భార్యభర్తలిద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. అదే రోజు అర్ధరాత్రి భర్త అనిల్ నిద్రిస్తుండగా రాధిక అతడి తలపై గొడ్డలితో వేటు వేసింది.
దీంతో అతడు స్పాట్ లోనే చనిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత రాధిక తన బంధువుకు ఫోన్ చేసి హత్య గురించి తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని ఆమెపై కేసును నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.