చివరి ఆయకట్టుకు నీరందించాలి : పువ్వాడ అజయ్

చివరి ఆయకట్టుకు నీరందించాలి : పువ్వాడ అజయ్

ఖమ్మం టౌన్, వెలుగు: నీటిపారుదల శాఖ అధికారులు చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. బుధవారం ఐడీఓసీలో అధికారులతో యాసంగి(రబీ) సీజన్ పై జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి పాలేరు రిజర్వాయర్ లోకి ఇప్పటికే 19 టీఎంసీల నీరు వచ్చిందన్నారు. గత యాసంగిలో1.72 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడు 2.25 లక్షలకు పెరిగిందన్నారు. యాసంగికి సాగునీటి సరఫరాకు కార్యాచరణ చేయాలన్నారు. నాగార్జునసాగర్ నుంచి అవసరం మేరకు నీటి సరఫరా ఉంటుందని, రైతులు ఆందోళన పడొద్దన్నారు. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రస్తుత పంటలకు తడి సరిగ్గా అందడంలేదని రైతులు ఆందోళన చెందవద్దని, చివరి ఆయకట్టుకు నీరందించే బాధ్యతను ఈఈ వెంకటేశ్వర రావుకి అప్పగించామని కలెక్టర్​ పేర్కొన్నారు. అధికారులు సమన్వయ లోపంతోనే నీరు సమృద్ధిగా ఉన్నా రైతులు ఇబ్బందులు పడుతున్నాని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. మొత్తం ఆయకట్టును కాపాడాలన్నారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ యూనిట్ అధికారిగా సీఈ జిల్లాను సమన్వయం చేయాలన్నారు. ఇంజనీర్లు కాల్వల వెంబడి పర్యటించి, తనిఖీలు చేస్తూ, రైతులు ఆందోళన చేస్తే, విషయాన్ని తెలియజేయాలన్నారు. రైతులు వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేస్తారని, పంటకు నీరు రాకపోతే నష్టపోతారని, సైన్టిఫిక్ గా నీటిని కేటాయించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. 

నీటికేటాయింపులో రైతులకు అన్యాయం..

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ సాగర్ లో 519 అడుగుల నీరు ఉన్నప్పుడే ఇబ్బందులు రాలేదని, 557 అడుగులు ఉంటే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయన్నారు.  డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఇరిగేషన్ సీఈ శంకర్ నాయక్, జేడీఏ విజయనిర్మల, ట్రాన్స కో ఎస్ఈ సురేందర్, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్ తోనే మహిళలకు మహర్దశ

ఖమ్మంకార్పొరేషన్, వెలుగు: సీఎం కేసీఆర్​పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చిందని రాష్ర్ట మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​అన్నారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు ఆఫీస్, నాగార్జున ఫంక్షన్​హాల్, భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి కేక్​కట్​చేసి మహిళలకు తినిపించారు. బ్యాంక్​ లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశారు. స్ర్తీనిధి ద్వారా రూ.18వేల కోట్ల రుణాలను ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణనే అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, డిఫ్యూటీ మేయర్​ఫాతిమా జోహరా, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, సుడా చైర్మన్​విజయ్​కుమార్, ఏఎంసీ చైర్మన్​శ్వేత, డీఎంహెచ్​ఓ మాలతి, జడ్పీటీసీ ప్రియాంక పాల్గొన్నారు.

ఆరోగ్య మహిళ.. ఆడబిడ్డకు వరం

ఆరోగ్య మహిళ పథకం మహిళలకు వరంలాంటిదని, ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున మరో గొప్ప వరాన్ని అందించిందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జిల్లా ఆసుపత్రిలో మహిళల కోసం 65పడకల ప్రత్యేక వార్డును ఆయన మేయర్​నీరజతో కలిసి ప్రారంభించారు. మహిళల కోసం రేడియాలజీ యూనిట్, మామోగ్రామ్ ను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మహిళకు మంగళవారం 57రకాల ఉచిత వైద్య పరీక్షలను చేస్తారన్నారు. మందులను సైతం ఉచితంగా పంపిణీ చేసి అవసరమైతే వారిని వేరే ఆసుపత్రికి రిఫర్​ చేస్తారన్నారు. మెరుగైన వైద్య సేవలతో కార్పొరేట్​ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, డీఎంహెచ్ఓ మాలతి, సుడా చైర్మన్​బచ్చు విజయ్​కుమార్, ఏఎంసీ చైర్మన్​ దొరేపల్లి శ్వేత,​ పగడాల నాగరాజు, కలెక్టర్ వీపీ గౌతం, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్​వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీను, నందగిరి శ్రీను, ఆర్ వీఎస్​సాగర్ పాల్గొన్నారు.