- ప్రధాన పార్టీ టికెట్ల కోసం వెయ్యికి పైగా అప్లికేషన్లు
- బీఆర్ఎస్ నుంచే 446 మంది దరఖాస్తు
- రెండోసారి అప్లికేషన్లు తీసుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ
- బీజేపీలోనూ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహులు
మహబూబ్నగర్, వెలుగు: కొత్తగా ఏర్పడిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో కార్పొరేటర్ సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రతి డివిజన్ నుంచి ఒక్కో పార్టీ తరపున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో పది మందికిపైగానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు డివిజన్లకు ఇన్చార్జీలను నియమించింది.
వీరు వచ్చిన అప్లికేషన్ల వారీగా వారం రోజులుగా ఎంక్వైరీ చేసి మంగళవారం రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్ ఆయా పార్టీల హైకమాండ్కు పంపనున్నారు. ఇప్పటి వరకు మూడు ప్రధాన పార్టీల నుంచి 60 డివిజన్లలో టికెట్ల కోసం 1,069 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.
కాంగ్రెస్ నుంచి 373 మంది..
అధికార కాంగ్రెస్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. వారం కింద ఆశావహులు దరఖాస్తుచేసుకోవాలని డీసీసీ సూచించింది. ఇందుకోసం డీసీసీ ఆఫీసులో ఇద్దరు లీడర్లను నియమించింది. ప్రతి డివిజన్ నుంచి ఏడు, ఎనిమిది మంది చొప్పున అప్లికేషన్లు అందజేశారు. 60 డివిజన్లకు గాను 373 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పార్లమెంట్ ఇన్చార్జీగా నియమితులైన మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మీటింగ్ అనంతరం రెండోసారి అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఈ అప్లికేషన్లకు రూ.10 వేలకు పైగా ఫీజు నిర్ణయించనున్నారు. డీసీసీ ఆఫీస్ పేరు మీద డీడీ తీసుకొచ్చి దరఖాస్తు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను మంత్రుల సమక్షంలో పరిశీలించి ఫిల్టర్ చేయనున్నారు. ఫిల్టర్ చేసిన అప్లికేషన్లపై సర్వే చేసి, సర్వేలో ఎవరి వైపు మెజార్టీ ప్రజలు మొగ్గు చూపుతారో వారికే పార్టీ తరపున బీఫారం ఇవ్వనున్నారు.
బీజేపీ నుంచి 250 అక్లికేషన్లు..
బీజేపీలో కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఈ పార్టీ నుంచి ఇప్పటి వరకు కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి 250 మంది ఆశావహులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వచ్చిన అప్లికేషన్లను డివిజన్ల వారీగా విభజించారు. ఎనిమిది డివిజన్లకు ముగ్గురు చొప్పున సీనియర్ లీడర్లను డివిజన్ ఇన్చార్జీలుగా నియమించారు. వీరు వారం రోజుల నుంచి వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా డివిజన్లలో సర్వేలు చేస్తున్నారు. సర్వేలో ఎవరికి ప్రజల్లో ఎక్కువ మద్దతు ఉంది? ఇన్చార్జీల పరిశీలనలో ఎలాంటి అంశాలను గుర్తించారు? ఎక్కువ మెజార్టీ ఎవరికి ఉంది? అనే వివరాలను సేకరించి హైకమాండ్కు పంపనున్నారు.
అనంతరం డివిజన్ల వారీగా క్యాండిడేట్లను ప్రకటించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి మేయర్ పీఠానికి ఎవరు పోటీ పడతారనేది తేల్చలేదు. ముందు కార్పొరేటర్లను గెలిపించుకున్న తర్వాతే మేయర్ ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్లో పోటాపోటీ..
బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఈ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరగా.. 446 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నాల్గో డివిజన్ నుంచి 20 మంది, 16వ డివిజన్ నుంచి 18 మంది, 18వ డివిజన్ నుంచి 14 మంది, 2వ డివిజన్ నుంచి 11 మంది, 29వ డివిజన్ నుంచి 8 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
ఈ అప్లికేషన్ల పరిశీలనకు ఆ పార్టీ 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వీరు అప్లికేషన్లను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో రిపోర్ట్ను హైకమాండ్కు పంపనున్నారు. ఫైనల్గా హైకమాండ్ క్యాండిడేట్లను ప్రకటించనుంది.
