
హైదరాబాద్ చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చందానగర్ లోని సెంట్రో షాపింగ్ కాప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయి. దీంతో కస్టమర్లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
హైవేపై ఉన్న అతిపెద్ద కాంప్లెక్స్ లో మంటలు వ్యాపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. సెంట్రో కాంప్లెక్స్ కు పక్కనే ఉన్న బిల్డింగ్ లకు కూడా మంటలు వ్యాపించడం కలకలం రేపింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. పక్కనే హాస్పిటల్ బిల్డింగ్ కు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా చందానగర్ – లింగంపల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.