- రూ.4 లక్షలతోపాటు రూ.9 లక్షల విలువైన విదేశీ కరెన్సీ కూడా..
చార్మినార్, వెలుగు: రైన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరగడం కలకలం రేపింది. యాకుత్పురా మసీదు సమీపంలో నివసించే మహమ్మద్ ఖలీల్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అల్మారా తాళాలు పగులగొట్టి చేతివాటం ప్రదర్శించారు.
సుమారు 17 తులాల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదుతోపాటు దాదాపు రూ.9 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ నేతాజీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
