కరీంనగర్ టౌన్, వెలుగు: వచ్చే డిసెంబర్ లో రాష్ట్రంలో జరగనున్న ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ లో యోగా క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించి తెలంగాణను ఫస్ట్ ప్లేస్ లో నిలపాలని అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి సూచించారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన 17వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 17వ సారి ఓవరాల్ ఛాంపియన్ గా కరీంనగర్ నిలవడం గొప్ప విషయమన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ సంయుక్తంగా రెండోస్థానంలో నిలవగా, మూడో స్థానంలో నిజామాబాద్ నిలిచినట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించాలని సూచించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిద్దారెడ్డి, జాతీయ స్థాయి పతక గ్రహీత దీపక్, మనోజ్ కుమార్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి పాల్గొన్నారు.
