బీఆర్​ఎస్​కు మైనంపల్లి రాజీనామా

బీఆర్​ఎస్​కు మైనంపల్లి రాజీనామా
  • ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే నిర్ణయం తీసుకున్నట్లు వీడియో రిలీజ్​
  • ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు :  మల్కాజ్​గిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. మల్కాజ్​గిరి ప్రజల కోరిక మేరకు, తన కార్యకర్తల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అందులో ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే తెలియజేస్తానని స్పష్టంచేశారు. అందరి సహకారాన్ని తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోనని మైనంపల్లి పేర్కొన్నారు. మల్కాజ్​గిరి ప్రజలకు, రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటానని చెప్పారు.

‘‘నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను. దేనికీ లొంగే ప్రసక్తి లేదు” అని స్పష్టం చేశారు. కాగా, కొన్నిరోజులుగా బీఆర్​ఎస్​ అధిష్టానంపై మైనంపల్లి హన్మంతరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మల్కాజ్​గిరి టికెట్​, తన కొడుకు రోహిత్​కు మెదక్​ టికెట్​ కేటాయించాలని ఆయన డిమాండ్​ చేస్తూ వచ్చారు. అయితే.. కేసీఆర్​మాత్రం మైనంపల్లి హన్మంతరావుకు మాత్రమే టికెట్​ కేటాయించారు. ఇదే క్రమంలో తిరుపతిలో మైనంపల్లి చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. 

కాంగ్రెస్​లో చేరిక? 

మైనపంల్లి హన్మంతరావు త్వరలో కాంగ్రెస్‌‌ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయన.. ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్​లో చేరుతారన్న ఊహాగానాలు విని పిస్తున్నాయి.