
హైదరాబాద్, వెలుగు: ముఖేశ్ గౌడ్ మెమోరియల్ 'మల్లయుద్ధ' రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు గురువారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఆరంభమయ్యాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన రెజ్లింగ్ క్రీడాకారులను గుర్తించి, జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన ఉపకార వేతనాలు అందించే లక్ష్యంతో శ్రేష్ఠ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కుస్తీ పోటీలను మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. ‘ ముఖేశ్ గౌడ్ రెజ్లర్గా కెరీర్ను మొదలుపెట్టారు. ఆయన స్మారకార్థం రూ.35 లక్షల నగదు బహుమతితో కుస్తీ పోటీలను ఈ స్థాయిలో నిర్వహించటం అభినందనీయం. శ్రేష్ఠ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర రెజ్లర్లు ఉన్నత స్థాయికి చేరుకోవాలని' డీకే అరుణ ఆకాంక్షించారు. శ్రేష్ఠ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్రమ్ గౌడ్తో కలిసి ఆమె పోటీలను ప్రారంభించారు. తొలి రోజు పురుషుల అండర్-15, అండర్-17 విభాగాల్లో కుస్తీ పోటీలు జరిగాయి. 17 విభాగాల్లో 700 మంది రెజ్లర్లు పోటీపడుతున్న రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీలు ఫిబ్రవరి 12న ముగియనున్నాయి.