బీజేపీకి 180 సీట్లు దాటయ్​ .. ఆ భయంతోనే కాంగ్రెస్​ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్​ ముద్ర: ఖర్గే 

బీజేపీకి 180 సీట్లు దాటయ్​ .. ఆ భయంతోనే కాంగ్రెస్​ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్​ ముద్ర: ఖర్గే 
  • బీజేపీ పరిస్థితి దిగజారింది
  • మోదీ, షా పూర్వీకులే అప్పట్లోముస్లిం లీగ్​కు సపోర్ట్ ​చేసిన్రు
  • పదేండ్ల అన్యాయాన్ని పారదోలేందుకు సమష్టి కృషి

న్యూఢిల్లీ: పార్లమెంట్​ ఎన్నికల్లో 180 సీట్లు కూడా రావని ప్రధాని మోదీకి భయం పట్టుకున్నదని కాంగ్రెస్​ విమర్శించింది. అందుకే కాంగ్రెస్​ మేనిఫెస్టోను చూసి అది ముస్లిం లీగ్​ స్క్రిప్ట్​లా ఉందంటూ గిలాగిలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసింది. బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో ఆర్ఎస్ఎస్​ తన పాత మిత్రుడైన ముస్లిం లీగ్​ను గుర్తు చేసుకుంటున్నదని కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ మల్లికార్జున ఖర్గే చురకలంటించారు. 

కాంగ్రెస్​ మేనిఫెస్టోపై ముస్లింలీగ్​ ముద్ర ఉన్నదని, కాంగ్రెస్​ నాయకుల మాటలు జాతీయ సమగ్రత, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆదివారం నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు సోమవారం ఖర్గే ‘ఎక్స్’​ వేదికగా కౌంటర్​ ఇచ్చారు. స్వాతంత్రోద్యమ కాలంలో మోదీ, అమిత్​ షా పూర్వీకులు (ఆర్ఎస్​ఎస్​ నేతలు) భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటీష్​, ముస్లిం లీగ్​కు మద్దతు ఇచ్చారని తెలిపారు. 

మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ నేతృత్వంలో గాంధీ పిలుపునిచ్చిన 1942 క్విట్​ ఇండియా ఉద్యమాన్ని కూడా మోదీ, అమిత్​ షా పూర్వీకులు వ్యతిరేకించారని ఖర్గే గుర్తు చేశారు. నేటికీ వారు సాధారణ భారతీయ పౌరుల సహకారంతో రూపొందించిన ‘కాంగ్రెస్​ న్యాయ పత్రం’కు వ్యతిరేకంగా ముస్లిం లీగ్​ను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. 

ముస్లిం లీగ్​, బీజేపీ ప్రభుత్వం.. 

1940లో మోదీ, షా పూర్వీకులు బెంగాల్​, సింధ్, నార్త్​ వెస్ట్​ ఫ్రాంటియర్​ ప్రావిన్స్​ (ఎన్​డబ్ల్యూఎఫ్​పీ)లో ముస్లింలీగ్​తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అందరికీ తెలుసని ఖర్గే అన్నారు. మోదీ, అమిత్​ షా, వారి నామినేటెడ్​ అధ్యక్షుడు కాంగ్రెస్​ మేనిఫెస్టోపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రసంగాలు ఆర్ఎస్ఎస్ ఎజెండాను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ‘కాంగ్రెస్​ న్యాయ పత్రం’ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందనేది ఒక్కటే నిజమని నొక్కిచెప్పారు. తమ పార్టీ సమష్టి బలంతో పదేండ్ల 
మోదీ అన్యాయాలకు తెరదించుతామని ఖర్గే చెప్పారు. 

ప్రాబల్యం కోల్పోతుండటంతో..​: సుప్రియా

బీజేపీ ప్రాబల్యం కోల్పోతుండటంతో ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే విమర్శించారు. అందుకే ప్రధాని మోదీకి ముస్లింలీగ్​పై ప్రేమ మళ్లీ పుంజుకున్నదని చురకలంటించారు. సోమవారం ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ మేనిఫెస్టోపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన బ్లూప్రింట్​ అని ఆమె పేర్కొన్నారు.

 ఈ పదేండ్లలో ప్రధాని మోదీ దేశం కోసం ఏమీ చేయలేదని, అందుకే ఎన్నికల సమయంలో మరోసారి హిందూ ముస్లిం స్క్రిప్ట్​ను ఆశ్రయించారని విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్​ ప్రదేశ్​, తెలంగాణ, కర్నాటకలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్టు తెలిపారు.  మోదీజీ.. మా గ్యారంటీ అనే పదాన్ని మీరు దొంగిలించినా.. మీ మాట ఎవరూ వినరు. మీ జుమ్లాల (అబద్ధాలు)పై ప్రజలు నివేదిక కోరుతున్నారు. ఇక మీరు బ్యాగులు ప్యాక్​ చేసుకొని ఇంటికెళ్లేందుకు రెడీగా ఉండండి’ అని  చురకలంటించారు.