కూచ్బెహర్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జై శ్రీరామ్ నినాదాలు చేయక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్ ఎన్నికలు ముగిసేసరికి మమత జై శ్రీరామ్ నినాదాలు చేస్తారని షా చెప్పారు. కూచ్బెహర్లో పోరిబోర్టన్ యాత్రలో పాల్గొన్న షా.. దీదీపై విమర్శలకు దిగారు.
‘జై శ్రీరామ్ నినాదాన్ని మమతా బెనర్జీ అవమానకరంగా ఎందుకు చూస్తున్నారు? ఈ నినాదం అంటే చాలా మందికి ఇష్టం, గౌరవం ఉన్నాయి. కానీ ఈ స్లోగన్ వల్ల మమతాజీకి అవమానక భావన ఎందుకు కలుగుతోందో? ఓట్ల కోసం ఒక వర్గం వారిని ప్రసన్నం చేసుకుంటే, ఆకట్టుకుంటే చాలని దీదీ భావిస్తున్నారా? జై శ్రీరామ్ నినాదాలు మన దేశంలో కాకుంటే పాకిస్థాన్లో మారుమోగుతాయా? బెంగాల్లో జరగబోయే ఎన్నికలు ముఖ్యమంత్రినో, మంత్రినో, ఎమ్మెల్యేనో మార్చడానికి కాదు. మొత్తం బెంగాల్ పరిస్థితిని మార్చడానికని అర్థం చేసుకోవాలి. బెంగాల్ సరిహద్దుల్లోకి ఒక్క పిట్ట కూడా రాకుండా చూసుకుంటాం’ అని షా పేర్కొన్నారు.